కిరణ్ వెన్నుపోటు: రామచంద్రయ్య, రఘువీరా నిర్దేశం
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను నిరుత్సాహపర్చే కుట్ర జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఈ పరీక్షా సమయంలో వారికి మేమందరం ఉన్నామని చెప్పాలని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడారు. సమావేశంలో ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించారు.
భేషజాలు, ఈగోలు వదిలిపెట్టి కలిసి పని చేద్దామని నాయకులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఇచ్చిన వాగ్ధానాలు అమలయ్యేందుకు కృషి చేద్దామని రఘువీరా రెడ్డి అన్నారు. యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అసెంబ్లీలో సభ్యులు లేకపోయినప్పటికీ.. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి సభ్యులున్నారని, వారు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తారని చెప్పారు.
లోకసభలో రాష్ట్రం నుంచి సభ్యులు లేకపోయినప్పటికీ రాజ్యసభలో ఐదుగురు సభ్యులున్నారని అన్నారు. ప్రజా, పార్టీ సమస్యలపై వెంటనే స్పందించేందుకు 13 జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అమలు చేస్తామని రఘువీరా అన్నారు.
కిరణ్ వెన్నుపోటు పొడిచారు
పార్టీలో ఉండి ఉన్నత పదవులు అనుభవించి ఎన్నికల సమయంలో పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం ఉందని ఆయన అన్నారు. కష్టపడి పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకొద్దామని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి పొందగలమన్నారు.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. క్యాడర్లో ధైర్యం నింపి పార్టీని బతికించుకుందామని అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉండి కూడా సరైన విధంగా స్పందించని కారణంగానే ఇలాంటి ఫలితాలు వచ్చాయని మాజీ కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. ఐక్యంగా పనిచేయకపోవడం లోపమేనని ఆయన అన్నారు.