అన్యాయం: సిఆర్, అంత ఎందుకు?: రాఘవులు
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కేంద్రం వెనుకడుగు వేస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెసు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు నిర్ణయాలు, ప్రాధాన్యతలు రాష్ట్రాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ శక్తుల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిల పక్ష నేతలను చంద్రబాబు ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు సాధ్యం కాదనడం అన్యాయమని సిఆర్ అన్నారు.
ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించాలని ఆయన కోరారు. వెంకయ్యనాయుడు కూడా ఆ మేరకు బిజెపిని, కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానికి 30 వేల ఎకరాలు ఎందుకని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం రైతుల భూములను లాక్కోకుండా ముందుగా రాజధాని ప్రాంతంలో ఉన్న బడా నేతలు, పారిశ్రామిక వేత్తల గుప్పిట్లో ఉన్న 2 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాలు చుట్టిరావడం కాదని, ప్రకాశం బ్యారేజ్ చుట్టపక్కల జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.