బాబు నన్ను బాగా చూసుకున్నారు కానీ, అందుకే యూజ్లెస్ అన్నా: రామచంద్రయ్య
గుంటూరు: తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 5 లక్షల ఎకరాలను కొన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారని, దానిని వారు నిరూపిస్తే వాటిని టిడిపి యువనేత నారా లోకేష్కు రాసివ్వమని చెబితే రాసిస్తామని వైసిపి నేత అంబటి రాంబాబు గురువారం సవాల్ చేశారు.
రాజధానిలోని భూముల పైన విచారణకు సిద్ధమని టిడిపి నేతలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తాము ఒక్క ఎకరం కూడా బినామీ పేర్లతో కొనలేదని చెప్పాలని, దానిని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు ఎక్కడ కార్యక్రమం మొదలు పెట్టినా తొలుత బినామీలతో కొనుగోలు చేయించి, ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు.
తమ పార్టీ అధినేత జగన్ 5లక్షల ఎకరాలు కబ్జా చేశారని టిడిపి నేతలు చెబుతున్నారని, దానిని నిరూపించాలన్నారు. దానిని నిరూపిస్తే మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలకు చెరీ సగం రాసిస్తామన్నారు. సిగ్గుంటే దానిని నిరూపించాలన్నారు.
ఆ భూములను రాయమంటే మంత్రులకు రాస్తాం లేదంటే లోకేష్కు రాయమంటే అలాగే రాస్తామని చెప్పారు. జగన్ మీద బురద జల్లి తప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు. మంత్రులకు సిగ్గుంటే విచారణకు సిద్ధపడాలన్నారు.
చంద్రబాబు నన్ను బాగా చూసుకున్నారు కానీ: సి రామచంద్రయ్య
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనను బాగా ఆదరించారని సి రామచంద్రయ్య షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు విధానాలతో మాత్రమే తాను విభేదించి టిడిపిని వీడానని చెప్పారు. సామాజిక న్యాయానికి చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారన్నారు. అందుకే ఆ పార్టీని వదిలానని చెప్పారు.
రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు అసైన్డు భూములు కొన్నారని ఆరోపించారు. భూదందా ఆరోపణల పైన విచారణ జరిపించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రం బాగుపడదన్నారు.
చంద్రబాబు తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, అందుకే యూజ్లెస్ సీఎం అన్నానని రామచంద్రయ్య చెప్పారు. పోలవరానికి రూ.100 కోట్లు ఎలా సరిపోతాయో చెప్పాలన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.
మీ పార్టీ నేతల పేర్లు ఎందుకు ప్రస్తావించరు: దూళిపాళ్ల
జగన్ బతుకే ఒక బినామీ బతుకని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉండే నివాసం, ఆయన ఉపయోగించే కార్లు అన్నీ బినామీవేవని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పిచ్చి రాతలు రాయిస్తున్న జగన్ పైన మండిపడ్డారు.
అయినా, రాజధాని ప్రాంతంలో కుటుంబసభ్యుల పేరిట భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో వైసిపి నేతలు కూడా భూములు కొనుగోలు చేశారన్నారు. ఆ విషయాలను సాక్షి ఛానల్, న్యూస్ పేపర్లో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వైసిపి నేతల చిట్టా తన వద్ద ఉందని త్వరలోనే బయటపెడతామన్నారు.