చంద్రబాబుపై సీఆర్ ఆగ్రహం
కడప: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి విపక్షనేత సీ రామచంద్రయ్య విమర్శించారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంటే కేవలం 31 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని చెబుతున్న ముఖ్యమంత్రి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలను ప్రకటించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. నకిలీ విత్తన కంపెనీలను మంత్రే ప్రోత్సహిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని వివరించారు. కరువు దెబ్బతో పశువులకు మేత దొరికే పరిస్థితి కన్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యేలు విశృంఖలంగా ప్రవరిస్తూ ఇసుక వ్యవహారంలో కొట్టుకోవడం వాస్తవం కాదా అన్ని నిలదీశారు. జనచైతన్య యాత్రలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చైతన్యం టీడీపీ నేతల్లో రావాలని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.