చంద్రబాబు లీకులే ఇస్తారు, టీడీపీతో పొత్తుతో బీజేపీ బలైంది: కాంగ్రెస్ నేత
అమరావతి: 2014లో చంద్రబాబుతో పొత్తు కారణంగా బీజేపీ బలైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలవాటు అని ఎద్దేవా చేశారు.
'మాల్యా నివాసంలో జగన్ కూతుళ్లు.. నిజం కాదా? లీక్ కావడంతో జగన్ కొత్త ఎత్తుగడ!'
ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన అధికారంలోకి వస్తారు తప్ప సొంతగా ఎప్పుడూ రాలేదన్నారు. 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు బీజేపీని బూచీగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. నాడు టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీ బలైందన్నారు.
చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారు
చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీ రామచంద్రయ్య అన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీక్షల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారని, ఏ విషయాన్ని సూటిగా చెప్పరన్నారు.
లాలూచీ రాజకీయాలు
బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు కర్నాటక ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమదే అధికారమన్నారు. వైసీపీని చూసుకొని బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం నిధులు ఇస్తానని చెబితే ఏపీ తీసుకోలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు చెప్పడం విడ్డూరమన్నారు.
నో కరెన్సీ బోర్డులు
ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధాని మోడీకి పగ అని, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఈర్ష్య ఆయనకు ఉందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా మండిపడ్డారు. ఆయనకు బుద్ధి రావాలనే ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏటీఎం కేంద్రాల వద్ద నో కరెన్సీ బోర్డులు ఉంటే కర్ణాటక ఏటీఎంలలో నిండుగా నగదు ఉందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి నగదు అంతటిని తీసుకెళ్తూ సామాన్యుల్ని ఇబ్బందిపెట్టడం సమంజసమా అన్నారు.
ఇందిరా గాంధీకి పట్టిన గతి
తెలుగువాళ్ల జోలికి వస్తే నాడు ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇప్పుడు ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి పడుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. ఢిల్లీ కంటే అద్భుత రాజధాని నిర్మిస్తామని, అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన మోడీ ఒట్టి విస్తరాకు, ఖాళీ గ్లాసుతో సరిపెట్టారన్నారు. అన్యాయం చేసిన వారిని తెలుగుజాతి వదిలిపెట్టదన్నారు.