కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: కొత్తగా 98వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
రూ. 7725 కోట్లతో దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు
దేశంలో మొత్తం మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతోపాటు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తుంకూరు పారిశ్రామిక కారిడార్లతోపాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్ హబ్ అండ్ మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దేశంలోన మూడు పారిశ్రామిక కారిడార్లను రూ. 7,725 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనుందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాధి లభించనుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
రూ. 2139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్..
కాగా, ఏపీలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతోపాటు తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని కేంద్రమంత్రి చెప్పారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ కారణంగా లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడంతోపాటు నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు. వీటితోపాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతిభద్రతలకు సంబంధించిన ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్తో కొత్తగా 98వేల ఉద్యోగాలు
కేంద్ర కేబినెట్.. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు ఆమోదం తెలపడంపై వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రూ. 2139 కోట్లతో చేపట్టే ఈ కారిడార్ నిర్మాణంతో సుమారు 98,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఎంపీ విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.