ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ..: టార్గెట్ చంద్రబాబు..టీడీపీ నేతలు: కేంద్రంతో చర్చించి..!
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి తాజాగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో జరిగిన చర్చ వరకు సీఎం జగన్..చంద్రబాబు లక్ష్యంగా చేస్తున్న ఆరోపణ ఇన్ సైడర్ ట్రేడింగ్. దీని పైన జగన్ సీఎం అయిన వెంటనే అధ్యయనం కోసం మంత్రులతో సబ్ కమిటీ నియమించారు. రాజధాని భూములతో పాటుగా.. గత ప్రభుత్వ అయిదేళ్ల కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణల పైన మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేసారు. వారు ఈ ఆరు నెలల పాటు అనేక రంగాల్లో వచ్చిన అభియోగాల పైన విచారణ చేసారు.
ముఖ్యమంత్రి జగన్ కు అందించారు
అధికారులతో చర్చించారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు. అవన్నీ కలిపి నివేదిక సిద్దం చేసారు. ఆ నివేదికను ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ కు అందించారు. దీంతో..సభలో ఇప్పటికే ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేసారు. అందులో భాగంగా..రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన సీబీఐ విచారణకు ఇవ్వాలని పలువురు మంత్రులు కేబినెట్ సమావేశంలో కోరారు. దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే సమయంలో కేంద్రంతోనూ చర్చించాలని భావిస్తున్నారు.
సబ్ కమిటీ నివేదికలో టీడీపీ నేతల పేర్లు..
గత ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిదంటూ వచ్చిన ఆరోపణల పైన మంత్రివర్గ ఉప సంఘం ఆరుగురు మంత్రులతో ఏర్పాటైంది. సభ్యులుగా ఉన్న మంత్రులు దీని పైన అధ్యయనం చేసి ఈ రోజు కేబినెట్ సమావేశం సమయంలో ముఖ్యమంత్రికి నివేదిక అందచేసారు. దీంతో..రాజధాని పైన వివాదం సమయం లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు మొదలు అన్ని పార్టీల నేతలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో..ఇప్పుడు రాజధాని తరలింపు ప్రతిపాదన సమయం లోనే ఈ అంశం పైన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంత్రులు సమర్పించిన నివేదిక లో ఇన్ సైడర్ కు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీని పైన కఠినంగా చర్యలు తీసుకొని..ఆ భూములు తిరిగి నష్టపోయిన రైతులకు ఇప్పించాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా సమాచారం.
సీబీఐ విచారణకు ఇవ్వాలంటూ..
రాజధాని లో రైతులు ఆందోళన చేస్తున్న వేళ..వారు సైతం తమ ప్రాంతంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి ఉంటే వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. భారీ స్కాం కావటంతో పాటుగా రైతులను మోసం చేసిన అంశం కావటంతో దీనిని సీబీఐకు అప్పగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.
తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే మంత్రి బుగ్గన నాలుగు వేల కోట్లకు పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ కొందరి పేర్లను బయట పెట్టారు. అందులో మాజీ మంత్రులు..టీడీపీ నేతలు ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా అందచేసిన నివేదికలో పూర్తి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి స్పందిస్తూ..న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్దామంటూ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. అదే సమయంలో కేంద్రానిని సైతం నివేదించాలని నిర్ణయించారు.