త్వరలో మంత్రివర్గ విస్తరణ: తేల్చేసిన చంద్రబాబు, ‘మోడీకి చెబితే రివర్స్, పెట్రోల్-రూపాయి '100'కు!’
Recommended Video
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండాయని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై రూ.58 వేల 24 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వివరించారు.
పెట్రోల్, రూపాయి.. 100కు
అనంతరం కేంద్రంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాను సూచించిన వాటికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని విమర్శించారు. పెట్రోల్ రూ.100కు చేరుతుందేమోనని చంద్రబాబు ఎద్దేవాచేశారు. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోందని, డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు అవుతుందేమోనని అన్నారు.
మోడీకి చెబితే రివర్స్ చేశారు
‘పెద్ద నోట్లు రద్దు చేసి ఏం సాధించారు? అందర్నీ ఇబ్బంది పెట్టడం తప్ప! ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదు' అని చంద్రబాబు అన్నారు. రూ.2000, రూ. 500 నోట్లు రద్దు చేసి రూ.100, రూ.200 రూపాయల నోట్లను పెట్టండి అని అప్పట్లో కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని చెప్పానని, తాను చెప్పినదానికి వాళ్లు రివర్స్ చేశారని విమర్శించారు.
జగన్ లాంటి వ్యక్తిన పక్కన పెట్టుకున్నారు..
ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక వృద్ధి ఆగిపోయిందని, బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని ఆరోపించారు. జగన్లాంటి అవినీతి పరులను పక్కన పెట్టుకున్నారని కేంద్రంపై చంద్రబాబు మండిడ్డారు. నీతి, నిజాయతీ గురించి మాట్లాడే అర్హతను ప్రధాని కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ
కాగా, అంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని ఆయన వివరించారు. సీపీఎస్ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్ విధానం ఉందని, దీన్ని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నాటికి హైకోర్టు భవనం పూర్తవుతుందని, హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు వివరించారు.