ఇదీ చంద్రబాబు నిజస్వరూపం!, ఇందుకేనా నిప్పు అని చెప్పేది?: మిథున్ రెడ్డి
'సుమారుగా 16శాతం వరకు ఉన్న ముస్లిం మైనారిటీలకు, ఎస్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో చంద్రబాబు అసలు స్వరూపం' బయటపడిందని మిథున్ రెడ్డి విమర్శించారు.
పీలేరు: పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రిపదవులు కట్టబెట్టడం పట్ల ఏపీ అధికార పార్టీ టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టినప్పుడు ఘాటుగా స్పందించిన చంద్రబాబు.. ఇప్పుడు తాను కూడా అదే పనిచేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి విమర్శలు తీవ్రతరం అయ్యాయి. తాజాగా ఆ పార్టీ ఎంపీ చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. మాట్లాడితే నిప్పునని ప్రగల్బాలు పలికే చంద్రబాబు వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయించుకుండానే మంత్రులుగా ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందని మిథున్ రెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడమేనా? చంద్రబాబు ప్రదర్శించే నీతి అంటూ నిలదీశారు. దేశ రాజకీయాల్లో తానే సీనియర్ అని గొప్పలు పోయే చంద్రబాబు మరో పార్టీ ఎమ్మెల్యేలను తమ కేబినెట్లోకి ఎలా తీసుకుంటారని మండిపడ్డారు.
తనయుడు లోకేష్ కు మంత్రిపదవి కట్టబెట్టడం కోసమే మంత్రివర్గ విస్తరణ చేపట్టారంటూ మిథున్ రెడ్డి విమర్శించారు. 'సుమారుగా 16శాతం వరకు ఉన్న ముస్లిం మైనారిటీలకు, ఎస్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో చంద్రబాబు అసలు స్వరూపం' బయటపడిందని అన్నారు.
అవినీతి, అక్రమాలతో నిండిపోయిన టీడీపీ పాలనకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. తేదీ ఎప్పుడైనా ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం పక్కా అని మిథున్ రెడ్డి జోస్యం చెప్పారు.