రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పోరుబాట పట్టారు. సెక్రటేరియట్ను విశాఖపట్నానికి మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 32 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాజధాని అమరావతి కోసం కొనసాగిస్తున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, వామపక్షాలు, జనసేన, బిజెపి మద్దతు ఇస్తున్నాయి.
నేడు హై పవర్ కమిటీ భేటీ రద్దు ... రీజన్ ఇదేనా ?
20న ఏపీ అసెంబ్లీ.. చలో అసెంబ్లీ పిలుపుతో పోలీసుల అలెర్ట్
ఇక ఈనెల 20న రాజధానిపై ఏపీ క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 న అసెంబ్లీ సమావేశాలకు ముందు చలో అసెంబ్లీ కి పిలుపునిచ్చారు విపక్ష పార్టీలు,రాజధాని జేఏసీ . ఇక ఈ నేపధ్యంలో టెన్షన్ నెలకొంది. ఆ రోజే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్న నేపధ్యంలో ఆందోళన నెలకొంది. ఇక అసెంబ్లీ ముట్టడి పిలుపుతో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళనకారులెవ్వరూ కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు అక్కడ 144 సెక్షన్ విధించారు.
రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు
ఇక పోలీసులు రాజధాని రైతులకు ఇప్పటి నుండే నోటీసులు ఇస్తున్నారు. మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు డిపార్టుమెంట్ నుంచి నోటీసులు అందాయి. సెక్షన్ 149 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని రాజధాని ప్రాంత గ్రామస్థులకు పోలీసులు సూచించారు.
విపక్ష నేతలకు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు
ఇక వీరికి మాత్రమే కాకుండా విపక్ష నేతలకు కూడా నోటీసులు అందిస్తున్నారు. ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో అప్రమత్తమైన పోలీసులు విపక్ష నాయకులకు నోటీసులు అందిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వర్రావు నోటీసులు అందుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో 20న అసెంబ్లీ సమావేశాలు ఎలా కొనసాగుతాయి అన్న ఉత్కంఠ నెలకొంది.