రాష్ట్రపతిపాలన: ఏ సందర్భంలో, ఎపిలో ఎప్పుడెప్పుడు?
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దానిని సాయంత్రం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఆయన దానిపై సంతకం చేయనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ కిరణ్ పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తర్జన భర్జన అనంతరం రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుంది.
ఏ సందర్భాల్లో రాష్ట్రపతి పాలన
ఏ పార్టీకి మెజార్టీ లేనప్పుడు, రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు, ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వాలు మైనార్టీలో ఉన్నప్పుడు, ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ లేక, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రానప్పుడు, సంకీర్ణ ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు.
ఇప్పటి వరకు దేశంలో ఆయా రాష్ట్రాల్లో 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించారు. అత్యధికంగా మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్లో తొమ్మిదిసార్లు, బీహార్, పంజాబ్లలో ఎనిమిది సార్లు, కర్నాటక, పాండిచ్చేరి, ఓడిశాలలో ఆరుసార్లు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో 1973 జనవరి 11 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు. ఎపి ఏర్పడకముందు ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి రాష్ట్రపతి పాలన వచ్చింది. 1954 నవంబర్ 15 నుండి 1955 మార్చి 29 వరకు విధించారు.
1954లో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెసు, ఆంధ్ర ప్రజా పార్టీలతో కలిసి నడిచేది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం శాసన సభలో నెగ్గడంతో ప్రకాశం పంతులు రాజీనామా చేశారు. శాసన సభ రద్దు చేశారు. 1954 నవంబర్ 15 నుండి 1955 మార్చి 29 వరకు అంటే నాలుగు నెలల పదిహేను రోజులు రాష్ట్రపతి పాలన విధించారు. 1955 మార్చిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ఇక జై ఆంధ్ర ఉద్యమం సమయంలో 1973 జనవరి 17న అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహా రావు తన పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుండి రాష్ట్రపతి పాలన విధించారు. 1973 డిసెంబర్ 10న జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది.
రాష్ట్రపతి పాలన సమయంలో....
రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్కు ఇద్దరు సలహాదార్లను నియమిస్తారు. రాష్ట్ర కేబినెట్ బాధ్యతలను గవర్నర్, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వర్తిస్తారు.
పోలవరం ముంపు ప్రాంతాలపై ఆ తర్వాత నిర్ణయం
పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిలపై రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.