పెద్ద బాబు చిన్న బాబు చిక్కినట్లేనా..కేబినెట్ సబ్కమిటీ తేల్చిందేంటి..? వాట్ నెక్ట్స్ ?
"అమరావతి అంటూ బాహుబలి కంటె విపరీతమైన గ్రాఫిక్స్ చూపించాడు. ప్రజలను మోసం చేశాడు. తన సొంత సామాజిక వర్గం వారికే మేలు చేకూరేలా అమరావతి చుట్టూ ఉన్న భూములను కట్టబెట్టాడు. ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు. సింగపూర్కు వెళితే సింగపూర్ రాజధాని, జపాన్కు వెళితే అమరావతిని జపాన్లా తయారు చేస్తాం.. ఒకసారి లండన్, మరోసారి మరో దేశ రాజధాని.. ఇలా ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంలోని ప్రముఖ నగరంలా అమరావతిని తీర్చి దిద్దుతానన్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది?" ఇదీ వైసీపీ నేతలు చంద్రబాబు హయాంలో అమరావతిపై చేసిన ఆరోపణలు. అమరావతిలో చంద్రబాబు హయాంలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిగ్గు తేల్చేందుకు కేబినెట్ సబ్కమిటీని వేసింది. పూర్తి విచారణ చేసిన కేబినెట్ సబ్ కమిటీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ హైకోర్టుకు నివేదిక అందజేసింది.
అమరావతి హత్య: రాజధాని శంకుస్థాపనకు ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వస్తారు: సుంకర పద్మశ్రీ ఫైర్
అమరావతి భూములపై కేబినెట్ సబ్ కమిటీ
2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. అయితే చాలా నిర్ణయాలకు కోర్టులు బ్రేక్ వేస్తూ వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరిపించారు. ఈ క్రమంలోనే అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ జరిపించారు. కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. ఈ మధ్యే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా మరో బాంబు పేల్చేందుకు జగన్ సర్కార్ సిద్దమైంది. అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రావడంతో విచారణ చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో నివేదికను హైకోర్టుకు అందజేసింది సబ్కమిటీ.
కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో ఏముంది..?
ఇక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లను చేర్చినట్లు సమాచారం. అంతేకాదు రాజకీయనాయకుల పేర్లు, మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు భూమి లావాదేవీల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొంటూ హైకోర్టుకు రిపోర్టు సమర్పించింది కేబినెట్ సబ్ కమిటీ . ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి రాజధానిగా వస్తుందని ముందుగానే సమాచారం లీక్ కావడంతో 4,070 ఎకరాల భూమిని చాలా మంది బడాబాబులు ముఖ్యంగా టీడీపీ నేతలు కొనుగోలు చేశారని నివేదికలో పొందుపరచినట్లు సమాచారం. అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ విడుదలకు ముందే ఈ బడా బాబులంతా గుంటూరు కృష్ణా జిల్లా రైతుల నుంచి సాధారణ రేట్లకు భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం.
చంద్రబాబు నుంచి ఇతర మాజీ మంత్రుల పేర్లు
ముందుగానే రాజధాని గురించి తెలియడంతో భూములు కొన్న టీడీపీ నేతలు ఇతర పారిశ్రామిక వేత్తలు దీని నుంచి అక్రమంగా లబ్ది పొందారని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులో ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాదు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా భూములను అప్పగించి భారీగా సొమ్ము చేసుకున్నారని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ఇక కేబినెట్ సబ్ కమిటీ దాఖలు చేసిన అఫిడవిట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు పరిటాల సునీత, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్, ఎన్ఆర్ఐ వేమూరు రవి కుమార్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు మరికొందరున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది.
Recommended Video
బినామీ పేర్లతో లోకేష్ ప్రత్తిపాటి పుల్లారావు
ఇక భూములు కొనుగోలు విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఏపీ అసైన్డ్ భూముల చట్టంను ఉల్లంఘిస్తూ భూబదలాయింపులు జరిగాయని స్పష్టం చేసింది. 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘించిందంటూ వెల్లడించింది. ఇక మాజీ మంత్రులు నారా లోకేష్ ప్రత్తిపాటి పుల్లారావులు బినామీ పేర్లతో లావాదేవీలు నిర్వహించారని కేబినెట్ సబ్కమిటీ పేర్కొంది. ఇక తాజాగా వీటన్నిటిపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా అమరావతి సీఆర్డీఏ పరిధిలో జరిగిన భూకుంభకోణం, అదే సమయంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం.