కాగ్: ఎపి ప్రాజెక్టులపై అక్షింతలు, కోట్లు ప్రభుత్వానికి నష్టమన్న నివేదిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ అక్షింతలు వేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై చేసిన ఖర్చుపై కాగ్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఖర్చుకు, ఫలితానికి మద్య వ్యత్యాసం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం పెట్టింది.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై చేస్తోన్న ఖర్చు పట్ల కాగ్ అక్షింతలు వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో తీసుకొన్న ప్రాజెక్టులపై కాగ్ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాగ్ అభ్యంతరాలపై విపక్షాలు మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం దక్కింది.
అయితే కాగ్ అక్షింతలు వేయడాన్ని గతంలో ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొనేవి. అయితే రాను రాను కాగ్ అక్షింతలను పాలకులు పట్టించుకొన్నట్టుగా కన్పించడం లేదు. అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టి చేతులు దులుపుకొంటున్నారు.
పట్టిసీమపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రస్తావించే పట్టిసీమ ప్రాజెక్టుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది.డిస్టిబ్యూటరీల పనులు పూర్తి కాకుండానే అధిక ప్రీమియంతో టెండర్లను అప్పగించడంపై ప్రభుత్వంపై అదనంగా వంద కోట్ల భారం పడిందని కాగ్ అభిప్రాయపడింది. టెండర్ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడ సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకొన్నారని, దీని ద్వారా 198 కోట్ల అదనపు భారం పడిందని కాగ్ చెప్పింది.
లేని నిబంధనల కారణంగా రూ.20.62 కోట్ల నష్టం
పైపుల మీద రాయితీ ఉన్నా, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కాంట్రాక్టర్ కు తిరిగి చెల్లించారని కాగ్ నివేదిక తెలిపింది. ఈపీసీ ఒప్పందాల్లో లేని నిబంధనల కారణంగా ప్రభుత్వం మరో రూ.20.62 కోట్లు నష్టపోయిందని కాగ్ వెల్లడించింది.
గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో రూ.4.12 కోట్ల నష్టం
గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో రూ.4.12 కోట్ల ప్రభుత్వం నష్టపోయింది. పైపుల సామర్థ్యం తగ్గినా, మిగులు అనేది ప్రభుత్వానికి దక్కకుండా పోయింది. సరైన నిర్వహణ, శ్రద్ద లేకపోవడం మూలంగా ప్రాజెక్టు ప్రయోజనాలు అందడం లేదు.పురుషోత్తపట్నం పంప్ హౌజ్ విషయంలో కాంట్రాక్టర్ కు రూ.1.57 కోట్ల అనుచిత లబద్ది చేకూరిందని కాగ్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల తీరు అధ్వాన్నం
వ్యవసాయ మార్కెట్ కమిటీల తీరు అధ్వాన్నంగా ఉంది. 99 మార్కెట్ యార్డులు తనిఖీ చేస్తే 90 చోట్ల ఎలాంటి లావాదేవీలు జరగలేదు. వీటిని పర్యవేక్షించేందుకు సరైన యంత్రాంగం లేదు. మార్కెటింగ్ శాఖ వద్ద కనీస వివరాలు లేవని కాగ్ అక్షింతలు వేసింది.వృద్ధ్యాప్య పెన్షన్ల కోసం లక్షల ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.వయో వృద్దుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు ఖర్చు చేయడం లేదని కాగ్ అభిప్రాయపడింది.
ప్రభుత్వ భూమి ప్రైవేట్ కు ధారాదత్తం
విశాఖపట్టణంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతంలోని భూమిని ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు.అయితే ఈ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి 63.89 లక్షల నష్టం వాటిల్లనుంది.రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఆహారాన్ని తక్కువగా సరఫరా చేస్తున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేయడం లేదని కాగ్ అభిప్రాయపడింది. కడపలోని యోగి వేమన యూనివర్శిటీకి నిధులు కేటాయించలేదని కాగ్ స్పష్టం చేసింది.