బాబు అవినీతికి పోల’వరమే‘!, కాగ్ నివేదికతో బట్టబయలు, లక్షా50వేల కోట్ల అప్పులా?: బుగ్గన
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ పీఏసీ ఛైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికలో పోలవరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలైందని అన్నారు.
లోకేష్వి పచ్చి అబద్ధాలు: రోడ్లపై నాట్లు వేసిన రోజా!
పోలవరం, పట్టిసీమ అవినీతిపై కాగ్ తేల్చేసింది
గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మాట్లాడుతూ.. పోలవరం, పట్టిసీమ అవినీతిని కాగ్ తప్పు పట్టిందని, పట్టిసీమ అవసరం లేదని కాగ్ తేల్చి చెప్పిందని తెలిపారు. పోలవరం పనులపై థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ లేదని, క్వాలిటీ ఆడిట్ కూడా జరగలేదని ఆరోపించారు. ఇంతవరకు అంబుడ్స్మెన్ను నియమించలేదన్నారు. పోలవరం 2019నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అన్నారు.
హోదా తాకట్టు పెట్టారు..
పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని, పోలవరం డిజైన్లు, డ్రాయింగ్ ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. పోలవరం భూసేకరణ సక్రమంగా జరగలేదని, 96శాతం పునరావసం ఇవ్వలేదని కూడా కాగ్ చెప్పిందని తెలిపారు.
అంచనాలు 100శాతం పెంచిన బాబు సర్కారు
పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, దీని నిర్మాణం కూడా కేంద్రమే చూసుకుంటే బాగుంటుందని బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. ప్రత్యేక హోదా వస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని తెలిపారు. ప్రస్తుతం 40 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కోసమే అన్ని ప్రాజెక్టుల అంచనా వ్యయాలను ఏపీ ప్రభుత్వం వందశాతం పెంచేసిందని ఆరోపించారు.
లక్షా50వేల కోట్లు అప్పులా?
పోలవరం ప్రాజెక్టుకు స్టీల్, సిమెంట్ ప్రభుత్వమే ఎందుకు ఇస్తుందని, టెండర్ విధానం ఎందుకు పెట్టారని బుగ్గన ప్రశ్నించారు. కాంట్రాక్టర్కు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా రూ.1800 కోట్లు అదనంగా ఇచ్చారని తెలిపారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం నుంచి స్పష్టత ఎందుకు తీసుకోలేదని చంద్రబాబును నిలదీశారు. బాబు హయాంలో లక్షా50వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతికి పోలవరం ఖర్చులే నిదర్శనమని బుగ్గన దుయ్యబట్టారు.
Recommended Video