పనుల్లో పురోగతి లేదు,చర్యలు లేవు...ఖర్చు వివరాలు చెప్పలేదు: పోలవరం ప్రాజెక్ట్ పై కాగ్
అమరావతి:పోలవరం ప్రాజెక్ట్పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కీలక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని, పనులు ఊహించనంత మందకొడిగా జరుగుతున్నా కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్ ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
ప్రాజెక్ట్ కోసం వివిధ పనుల నిమిత్తం పెట్టిన ఖర్చుకు లెక్కలు చూపకపోవడంతో వేల కోట్ల రూపాయలు అందకుండా పోయాయని కాగ్ వెల్లడించింది. అలాగే కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్ను ఆమోదించకముందే హెడ్వర్క్స్ పనులు అప్పగించేశారని తెలిపింది. ఇలా ఒప్పందాలు రద్దయి అనూహ్యమైన ఖర్చులు పెరగడం వల్లే నిర్మాణవ్యయం విపరీతంగా పెరగడంతో పాటు నిర్మాణంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు కాగ్ తేల్చింది.
పునరావాసం...పురోగతి లేదు
పునరావాసం విషయమై కాగ్ నివేదికలో ఏమని చెప్పిందంటే?..ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రభుత్వం గత 12 ఏళ్లలో 4,069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించినట్లు వెల్లడించింది. ఇంకా 192 గ్రామాల విషయంలో పునర్నిర్మాణం ప్లాన్ ను ఖరారు చేయనేలేదని పేర్కొంది. అలాగే ఒడిశా, చత్తీస్గఢ్లలో ముంపు నివారణ కోసం నిర్మించ వలసిన రక్షణ కట్టల నిర్మాణ పనుల్లోనూ ఏ పురోగతి లేదని తేల్చేసింది.
భారీగా పెరిగిన...అంచనా వ్యయం
ఇక పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2005లో డీపీఆర్ ప్రకారం రూ.10,151 కోట్లు కాగా, 2010 డీపీఆర్ ప్రకారం దీని విలువ రూ.16,010 కోట్లు కు చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,132 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది.
అందుకే...అందలేదు
ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణాలపై పెట్టిన ఖర్చు వివరాలు నిబంధనల ప్రకారం వెల్లడించకపోవడం వల్లే కేంద్రం నుంచి అందవలసిన రూ.1,408 కోట్లు అందలేదని కాగ్ నివేదిక వెల్లడించింది. హెడ్వర్క్స్ కాంట్రాక్టర్కు రూ.1,854 కోట్ల రాయితీలకు అనుమతించిన పనుల్లోనూ పురోగతి లేదని కాగ్ వివరించింది.
అలా...జరగడం లేదు
మరోవైపు పునరావాస పనులు పర్యవేక్షించడానికి వేసిన కమిటీలు నిర్దేశించిన విధంగా సమావేశం కాలేదని కాగ్ పేర్కొంది. అలాగే అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా నిబంధనల ప్రకారం జరగడం లేదని ఈ రిపోర్ట్ లో కాగ్ స్పష్టం చేసింది.