ఏపీకి కాగ్ హెచ్చరికలు-అప్పులకు కొత్త అప్పులా-బడ్జెట్ అమలు కావట్లే- వచ్చే ఏడేళ్లలో లక్షకోట్లు
ఏపీలో 2019-20 కాగ్ నివేదిక వెల్లడైంది. ఇందులో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఏపీలో ఆర్ధిక నిర్వహణ, అప్పులు , వాటి తిరిగి చెల్లింపులు, బడ్టెట్ అమలు, శాసనసభకు చెప్పకుండానే తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. మొత్తంగా చూస్తే ఏపీ ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా మారిందని, భవిష్యత్తులో దీని ప్రతికూల పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికైనా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరాన్ని కాగ్ రిపోర్ట్ గుర్తు చేసింది.
కాగ్ రిపోర్ట్ 2019-20
ఏపీలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక పరిస్ధితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికను వెల్లడించింది. ఇందులో పలు కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా పేరుకుపోతున్న అప్పులు, వాటిని తిరిగి చెల్లించేందుకు పడుతున్న అవస్ధలు, శాసనసభకు తెలియకుండానే తీసుకుంటున్న నిర్ణయాలు, ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తుపై పడే ప్రమాదం వంటి అంశాల్ని కాగ్ స్పష్టంగా ప్రస్తావించింది. ముఖ్యంగా బడ్జెట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కాగ్ కడిగేసింది. 2020 మార్చికి పూర్తయిన పద్దుల ఆధారంగా తయారు చేసిన ఈ రిపోర్ట్ ను ప్రభుత్వం తాజాగా అసెంబ్లీకి సమర్పించింది.
పీడీ ఖాతాలు అస్తవ్యస్తం
రాష్ట్రప్రభుత్వం స్పల్పకాలిక అవసరాల కోసం వాడుకునేందుకు నిధుల్ని బదలాయిస్తున్న పీడీ ఖాతాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని కాగ్ తప్పుబట్టింది. పీడీ ఖాతాల నుంచి డబ్బులు ఖర్చుపెట్టకుండానే పెట్టినట్లు లెక్కలు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలా చేసేందుకే పీడీ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు ఉందని పేర్కొంది. పీడీ ఖాతాల పేరుతో పలు ప్రభుత్వ శాఖల అధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, వారు ఖర్చు చేసుకునేందుకు మాత్రం వీటిని అందుబాటులో ఉంచకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది.
అప్పుల వృథా ఇలా
రాష్ట్ర ప్రభుత్వం సగటున 6.31 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుంటోంది. దీన్ని వివిధ కంపెనీలు, కార్పోరేషన్లలో పెట్టుబడిగా పెట్టి కనీసం 0.04 శాతం ప్రతిఫలం కూడా పొందడం లేదని కాగ్ అక్షింతలు వేసింది. దీంతో ప్రభుత్వం వేర్వేరు రూపాల్లో సేకరిస్తున్న రుణాలన్నీ వృథా అవుతున్నాయని కాగ్ ఆక్షేపించింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఆయా రుణాలు తీర్చేందుకు సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు రుణం పుట్టకపోగా.. వనరులు కూడా తగ్గిపోతాయని కాగ్ హెచ్చరించింది. దీంతో తీసుకొస్తున్న అప్పుల్ని తీర్చే మార్గాలు ప్రభుత్వం వద్ద లేవని తేలిపోయింది.
పాత అప్పు తీర్చేందుకే 81 శాతం అప్పు
రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో అప్పుల శాతం పెరిగిపోతుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయంలో రుణాలు తీర్చేందుకే ఎక్కువ శాతం ఖర్చు పెట్టాల్సి వస్తోందని కాగ్ తెలిపింది. గతంలో తీసుకున్న అప్పుల్ని తీర్చేందుకే కొత్త అప్పుల్లో 65 నుంచి 81 శాతం మొత్తం ఖర్చుపెడుతున్నట్లు కాగ్ గుర్తించింది. ఇలా కొత్తగా తీసుకుంటున్న అప్పులు ప్రభుత్వానికి ఆదాయం అందించే కార్యక్రమాలపై ఖర్చు పెట్టకపోగా.. ఆర్ధిక అస్ధిరతకు దారి తీసేలా ఖర్చు పెట్టడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఏడేళ్లలో తీర్చాల్సిన అప్పు 1.10 లక్షల కోట్లు
2020 మార్చి నెల వరకూ లెక్కల్నే తీసుకుంటే రాబోయే ఏడేళ్లలో ఏపీ ప్రభుత్వం తీర్చాల్సిన అప్పు అక్షరాలా లక్షా పది వేల కోట్లుగా కాగ్ అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వం తీసుకున్న బడ్జేటేతర రుణాలు, గ్యారంటీ ఇచ్చినవి, గ్యారంటీ ఇవ్వని రుణాలు కూడా లేవని తెలుస్తోంది. ఇవి మాత్రమే 2 లక్షల కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈ మొత్తం కూడా కలుపుకుంటే దాదాపు 3 లక్షల కోట్లకు పైగానే చెల్లింపులు వచ్చే ఏడేళ్లలో ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆర్ధిక వనరులు సృష్టించుకోలేకపోతే కొత్త అప్పులు చేసి మరీ వీటిని చెల్లించాల్సి వస్తుంది. అప్పటికి అంత అప్పు పుట్టడం మరీ కష్టం.
అసెంబ్లీకి చెప్పకుండానే
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి చెప్పకుండానే పలు నిర్ణయాలు తీసుకుంటోందని కాగ్ గుర్తించింది. ఇందులో ప్రభుత్వం చేసిన అనుబంధ పద్దు మొత్తాలతో పాటు పలు వ్యవహారాలను ప్రస్తావించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఇలా ఖర్చు పెట్టిన రూ.15991 కోట్లను ఆర్ధిక సంవత్సరం ముగిశాక 2020 జూన్ లో అసెంబ్లీకి తెలిపినట్లు కాగ్ వెల్లడించింది. ఇది రాజ్యాంగ నిబంధనలకు సైతం విరుద్ధమని పేర్కొంది. అలాగే బడ్టెట్ పద్దుకు సంబంధం లేకుండా ప్రభుత్వం చేసిన రూ.26,096 కోట్ల అప్పుల్ని సైతం ఆ తర్వాత బడ్డెట్ లో సైతం ప్రస్తావించలేదని, ఇది పూర్తిగా శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమే అని కాగ్ ఆక్షేపించింది.
Recommended Video
కేంద్రం నిధులు వాడేసుకుంటూ
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కోసం 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చిన నిదుల్లో చాలా వరకూ రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాల కోసం దారి మళ్లించి వాడేసుకున్నట్లు కాగ్ గుర్తించింది. దీంతో కేంద్ర పథకాల అమలు లక్ష్యం నెరవేరడం లేదని తెలిపింది. 2018-19స 2019-20 ఆర్దిక సంవత్సరాలకు కేంద్రం.. రూ.16608.72 కోట్లు, రూ.11,78133 కోట్లను గ్రాంట్ గా ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కేవలం రూ. 4514 కోట్లు, రూ.5961 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది. దీని ప్రభావం తర్వాత కేంద్రం ఇచ్చే గ్రాంట్లపై పడుతుందని హెచ్చరించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం ఆర్బీఐలో ఏకంగా 221 రోజుల పాటు కనీస నిల్వలు ఉంచలేకపోయిందని కూడా కాగ్ తెలిపింది. ఈ పరిస్ధితి పునరావృతం కాకుండా తగిన ఆర్ధిక నిర్వహణ చేపట్టాలని సూచించింది.