బెయిల్పై వచ్చాక కాళ్లు విరగ్గొడతా!: కాల్మనీ బ్యాంక్ శ్రీను అరెస్ట్
విశాఖ: కాల్ మనీ నిందితుడు యరబాటి శ్రీనివాస్ రావు అలియాస్ బ్యాంకు శ్రీనును ఎట్టకేలకు వన్ టౌన్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు ఆంధ్రా బ్యాంకు ఏటీఎం కార్డులు, ఏడు ప్రామిసరీ నోట్లు, ఆరు చెక్కులు, ఒక ఇంటి దస్తావేజు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు బుధవారం నాడు వివరాలు వెల్లడించారు. బాధితులు అచ్చయ్య, ముత్తు అప్పలస్వామి, కంటుముంచు గిరికుమార్ జయరావు, జానకి రావు, అప్పారావులు నగర పోలీస్ కమిషనర్ను కలిసి గత నెల 24న ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు అళ్లిపురం, మిరపకాయలవీధికి చెందిన శ్రీనివాస రావు అలియాస్ బ్యాంకు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించారు. అవసరమైన వారితో ప్రామిసరీ నోట్లు, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకొని శ్రీను అప్పు ఇచ్చేవాడు.
కొంతమంది వద్ద ఏటీఎం కార్డులు తీసుకునేవాడు.య తీసుకున్న అప్పు తాలూకూ వడ్డీని ఏటీఎం ద్వారా వసూలు చేసుకునేవాడు. అప్పుతీరీనా ఇంకా వడ్డీ ఉందని అసలుకు పదిరెట్లు డబ్బు డ్రా చేసుకుంటున్నాడని, అతని వద్ద ప్రామిసరీ నోట్లు, చెక్కులు, ఏటీఎంలు ఇవ్వడం లేదని బాధితులు ఫిర్యాదు చేశారు.
వాటి గురించి అడిగితే చెక్కు బౌన్సు కేసులు వేస్తామని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. బ్యాంకు శ్రీని బాధితులు దాదాపు పదిహేను వందల మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. ఇతనిని బ్యాంకు శ్రీను అని పిలుస్తుండటం గమనార్హం.
ఎవరికైనా రుణాలు కావాలంటే బ్యాంకు ద్వారా ఇప్పిస్తుంటాడు. రుణాలు ఇప్పించి ఆ నగదుపై శ్రీను వడ్డీ వసూలు చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. కాగా, నా పైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, బెయిల్ పైన వచ్చి మీ కాళ్లు విరగ్గొడతానని అతను బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు.