వైసిపి నేత ఇంట్లో సోదాలపై అంబటి, కాల్చేయండి: సీఆర్, 'కాల్ మనీ' నిర్వహకులు వీరే..
విజయవాడ: కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ను సెలవులకు పంపించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మంగళవారం నాడు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాల్ మనీ పేరుతో మా కార్యకర్తల్ని అవమానిస్తున్నారన్నారు.
కాల్ మనీ నిందితులకు చంద్రబాబు రక్షణంగా నిలుస్తున్నారన్నారు. హడావుడిగా నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ను సెలవుల పైన ఎందుకు పంపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
గౌతమ్ సవాంగ్ ముక్కుసూటిగా పని చేసే వ్యక్తి అని, అందుకే ఆయనను సెలవులు అంటూ పంపిస్తున్నారన్నారు. కాల్ మనీ ఘటనను విపక్షాల పైకి నెట్టివేయవద్దన్నారు. కాల్ మనీ ముఠాలో సూత్రదారులు అంతా అధికార పార్టీ వారే అన్నారు.
ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఎవరి పైన పడితే వారి పైన కేసులు పెట్టడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల పైన ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. టిడిపి నేతలను అరెస్టు చేస్తున్నారనే సవాంగ్ను సెలవులపై పంపిస్తున్నారన్నారు.
జగన్ తెలుసుకొని మాట్లాడాలి: బొండా ఉమ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కాల్ మనీ విషయమై పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ హితవు పలికారు. వైసిపి పార్ట్ టైమ్ పొలిటికల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత సీ రామచంద్ర రావు మాట్లాడుతూ.. కాల్ మనీ కేసును సీబీఐతో దర్యాఫ్తు చేయించాలన్నారు. కాల్ మనీ నిర్వాహకులను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
హెచ్చార్సీలో కాంగ్రెస్ ఫిర్యాదు
కాల్ మనీ అంశం జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు చేరింది. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, జేడీ శీలం, కెవిపి రామచంద్రా రావు, టి సుబ్బరామి రెడ్డి, సుంకర పద్మశ్రీలు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
వైసిపి నేత ఇంట్లో సోదాలు
కాల్ మనీ వ్యవహారంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఇంటికి పోలీసులను పంపారన్నారు.
ముప్పై మంది పోలీసులతో తన ఇంట్లో సోదాలు చేసినా చిన్న ఆధారం దొరకలేదన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా వ్యక్తిగతంగా లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతలు కూరుకుపోయారని, ప్రజల దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారన్నారు.
కాల్ మనీ నిర్వాహకులు వీరే...
కాల్ మనీ ఏపీ వ్యాప్తంగా కలకలంరేపుతోంది. కొందరు కాల్ మనీ వ్యాపారుల పేర్లు వెలుగు చూశాయి. అందులో.. యలమంచిలి జయ, జ్వాలా చౌదరి, యలమంచిలి రాము, వడ్డే గాంధీ,క మధు శ్రీనివాస్, కందుల వెంకట్రావ్, లంకేపల్లి సతీష్, సముద్రాల నాగేశ్వర రావు, దర్శిపోటు సాయిబాబు, ఎన్ఎస్ఎం సెంటర్ దుర్గారావు, దేవీప్రసాద్, గోల శ్రీను, గుత్తా రాంబాబు, శ్రీనివాస్, శంకర్ బాబు, సింగ్ నగర్ మోహన్, వన్ టౌన్ మోలవరపు సుబ్బారావు, వీరబాబు తదితరుల పైర్లు వినిపిస్తున్నాయి. కాగా, కాల్ మనీ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాలని డిజిపి ఎస్పీలని ఆదేశించారు.