కాల్ మనీ ఎదిగింది ఇలా...!: రియల్ ఎస్టేట్కు లింక్, నాటి నుంచీ షాక్లే
విజయవాడ: బెజవాడలో కాల్ మనీ ప్రకంపనలు సృష్టిస్తోంది. నగరంలో దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన చిట్ ఫండ్స్ వ్యాపారాలు జోరుగా సాగాయి. ఆ దారిలోనే కాల్ మనీ తెరపైకి వచ్చింది. విజయవాడకు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వలస వచ్చారు.
ఆ సమయంలో నగరంలో చిట్ ఫండ్ కంపెనీల హవా సాగింది. వలస వారు అనధికారికంగా చిట్టీలు నడిపారని చెబుతుంటారు. అయితే, అప్పుడు ఆ చిట్టీలు కేవలం నమ్మకం పైన కొనసాగేవి. అయితే, ఈ చిట్టీల వ్యాపారంలోకి క్రమంగా మిగతా వారు కూడా వచ్చారు.
తొలుత ఈ చిట్టీల బిజినెస్ నమ్మకం పైన కొనసాగేది. కానీ ఆ తర్వాత చిట్టీ కట్టిన వారికి... ఎగవేసిన అంశాలు తెరపైకి వచ్చాయి. చాలామంది ఎగవేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చిట్ కంపెనీల హవా క్రమంగా తగ్గిపోయిందని చెబుతారు. వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి.
పోలీసులు చిట్టీల విషయమవై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు. చిట్ ఫండ్ ఆపరేట్ చేసే వారి పైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కాల్ మనీ పైన కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
చిట్టీల వ్యాపారం తర్వాత కాల్ మనీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ నిర్వాహకులు పెద్ద ఎత్తున వడ్డీని వసూలు చేస్తున్నారు. అవసరం నిమిత్తం చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు. ఇందుకోసం కాల్ మనీని ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు డిమాండ్ చేసినంత వడ్డీ ఇవ్వవలసి వస్తోంది.
కాగా, కాల్ మనీ గుంటూరు జిల్లాలోనే ప్రారంభమైందనే వాదనలు ఉన్నాయి. ఎక్కువ మంది ఫైనాన్సర్లు ఉంటే అనకాపల్లిలోను ఇది ఉద్భవించిందని చెబుతుంటారు. 'కాల్ మనీ' క్రమంగా అంతటికీ పాకింది.
ప్రధానంగా కాల్ మనీ బిజినెస్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల మరింత ఎక్కువయిందనే వాదనలు ఉన్నాయి. కాల్ మనీ నిర్వాహకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ వడ్డీకి డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు.
అంతేకాదు రైల్వే ఉద్యోగులు కూడా కాల్ మనీ నిర్వాహకులకు మంచి ఖాతాదారులట. మరో షాకింగ్ విషయమేమేటే.. గతంలో రైల్వే ఉద్యోగులు కాల్ మనీ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎం కార్డు వారికి ఇచ్చేవారట. ఆ డబ్బులను కాల్ మనీ నిర్వాహకులే డ్రా చేసుకునే వారట.