జగన్కు చెప్పాల్సిన అవసరం లేదు: 'కాల్ మనీ' నిందితుడితో తన ఫోటోపై బాబు
విజయవాడ: అసెంబ్లీలో వైసిపి అధినేత జగన్ ఇష్టమొచ్చినట్లుగా ఏమైనా మాట్లాడొచ్చని, కానీ ఆయన కోసం కాకుండా జనం కోసం ప్రతి అంశం పైనా వివరించి చెప్పేందుకు సభను ఉపయోగించుకోవాలని ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
బుధవారం శాసనసభ సమావేశాల్లో చేపట్టాల్సిన అంశాలు, వ్యూహంపై కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... మితిమీరిన ప్రవర్తనతో జగన్ ఏమైనా మాట్లాడినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు మాత్రమే బాధ్యులుగా ఉందామని వ్యాఖ్యానించారు.
పోలీస్ కమిషనర్ సెలవుపైనా రాజకీయమా? కాల్మనీ అంశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవు పెట్టడాన్ని కూడా వైసిపి రాజకీయం చేయడంపై చర్చ జరిగింది.
గౌతమ్ సవాంగ్ కుమార్తె విదేశాల్లో ఉండడంతో కుటుంబమంతా అక్కడికే వెళ్లి క్రిస్మస్ జరుపుకొనేందుకు ఆయన నెల ముందే సెలవు పెట్టారని, ఆయన విమానం టికెట్లు చూసినా ఆ విషయం తెలుస్తుందని, ఇప్పుడు ఆయన సెలవును కూడా రాజకీయం చేయడంతో కుటుంబంతో కలిసి వెళ్లలేకపోతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది.
మరోవైపు కాల్మనీతో సంబంధమున్న డీఈ సత్యానందం గతంలో చంద్రబాబుతో ఫోటో దిగారన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. చాలామంది ఫొటోలు దిగుతుంటారని, వారి చరిత్రేమిటో అప్పటికప్పుడు తెలుస్తుందా? లేదంటే భవిష్యత్తులో తప్పుచేస్తారని తెలుస్తుందా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
పద్దెనిమిది నెలలుగా మంత్రిగా ఉన్నా ఒక్క ఐటీ సంస్థనూ రాష్ట్రానికి తేలేకపోయారంటూ రాయలసీమకు చెందిన ఓ మంత్రిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. బుధవారం విజయవాడలో నిర్వహించిన 192వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
కాల్ మనీ ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వాతావరణం మెరుగు పడిందని, సమాజ ఆర్థిక పరిస్థితి కూడా బాగుందని, రుణ వసూళ్లలో బ్యాంకులకు ఇబ్బంది ఉండదని, సంపద పంపిణీలో సరయిన ప్రమాణాలను నెలకొల్పాలని, రుణాలు సరైన వ్యక్తులకు ఇవ్వకుండా అవాంఛనీయ శక్తులకు, అసాంఘిక కార్యకలాపాల కోసం ఇస్తే ఆ డబ్బు దుర్వినియోగం అవుతుందన్నారు.