కూతుర్ని ఎత్తుకెళ్తాం: కాల్ మనీలో ఎన్నో షాకింగ్లు, పోలీస్ యాక్షన్ ప్లాన్
విజయవాడ: కాల్ మనీ కేసులో విస్తు గొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే.. అధిక వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఇవ్వకుంటే బెదిరించడం, మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేయడం వెలుగు చూశాయి. తాజాగా మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి.
కాల్ మనీ దందాలు చేసేవారు... డబ్బులు ఇవ్వని పక్షంలో బాధితుల భూమిని కబ్జా చేస్తున్నారు. పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారు. కూతురును ఎత్తుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. బాధితులు రూ.1 లక్ష తీసుకొని అంతకు మూడు నుంచి ఎన్నో రెట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ వారు వదలడం లేదు.
అధిక వడ్డీని వసులు చేస్తున్నారు. ఓ మహిళ కూతురు పెళ్లి కోసమని రూ.30 వేలు అప్పు చేసింది. ఆమె మూడు లక్షలు చెల్లించినా కాల్ మనీ దందా చేసే వారు వదలడం లేదు. మరో మహిళ రూ.2 లక్షలు గుండె ఆపరేషన్ కోసం అప్పు తీసుకున్నారు.
ఆమె ఇప్పటి వరకు రూ.9 లక్షలు చెల్లించారట. అయినప్పటికీ మరింత చెల్లించాలని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే కొడుకును కిడ్నాప్ చేస్తామని, కూతురును ఎత్తుకెళ్తామని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఆమెకు చెందిన అర ఎకరం కబ్జా చేశారని కూడా సమాచారం.
దూడల, యలమంచిలికి రిమాండ్
కాల్ మనీ కేసులో అరెస్టైన యలమంచిలి రాము, దూడల రాజేష్కు న్యాయస్థానం ఈ నెల 28వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు కాల్ మనీ బాధితులు పోలీసు స్టేషన్లకు వరుస కడుతున్నారు.
మహిళల్ని వశపర్చుకుంటున్నారు వదలం: క్రైమ్ డిసిపి
కాల్ మనీ దందా పైన విజయవాడ క్రైమ్ డిసిపి స్పందించారు. కాల్ మనీ దందా చేసేవారు మహిళలను బలవంతంగా వశపర్చుకుంటున్నారని, నిందితులను వదిలేది లేదని చెప్పారు. చట్ట ప్రకారం చర్యలుతీసుకుంటామన్నారు.
కాల్ మనీ బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని, అండగా నిలుస్తామని చెప్పారు. న్యాయం కోసం బాధితులు తనను లేదా నగర పోలీస్ కమిషనర్ను కలవచ్చునని చెప్పారు. కాల్ మాఫియాను కట్టడీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ ఉందన్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు కూడా కాల్ మనీ బాధితులు డబ్బులు చెల్లించవద్దని సూచించారు.