కాల్ మనీ స్కామ్: కింగ్పిన్ను పట్టించిన సీక్రెట్ కెమెరా
విజయవాడ: కాల్ మనీ కుంభకోణం కీలక పాత్రధారిని సీక్రెట్ కెమెరా పట్టించింది. సీక్రెట్ కెమెరా సహాయంతో టాస్క్ఫోర్స్ పోలీసులు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రామును పట్టుకున్నారు. అపారెల్ డిజైనర్ అయిన ఓ మహిళ కాల్ మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసింది.
ఆ బాధితురాలి ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ అధికారులు రాముకు చెందిన ఓ కార్యాలయంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. రాము లావాదేవీలన్నీ ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంతో టాస్క్ఫోర్స్ అధికారులు రామును అరెస్టు చేశారు. రాము కార్యాలయం ఎల్లవేళలా సందర్శకులతో, వడ్డీకి అప్పులు తీసుకునేవారితో బిజీగా ఉంటుందని అంటారు.
రాముకు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, దీంతో రాము కార్యాలయంపై దాడులు చేయడానికి పటమట సిఐ నిరాకరించాడని, దాంతో ఆయనను సెలవుపై పంపించారని అంటున్నారు. టాస్క్పోర్స్ పోలీసులు చివరకు దాడులు చేసి రామును పట్టుకున్నారు.
అయితే, 35 ఏళ్ల అపారెల్ డిజైనర్, కాల్ మనీ బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ వ్యవహారమంతా వెలుగు చూసిందని అంటున్నారు.