44 మంది దొంగల్ని పెట్టుకొని మాట్లాడుతావా: జగన్ను ఏకేసిన టిడిపి
హైదరాబాద్: కాల్ మనీ పైన చర్చను తక్షణమే చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభలో డిమాండ్ చేసింది. గురువారం నాడు... పది నిమిషాల వాయిదా అనంతరం శాసన సభ తిరిగి ప్రారంభమైంది. కాల్ మనీ పైన చర్చను చేపట్టాల్సిందేనని పట్టుబట్టారు. డౌన్ డౌన్ సీఎం అంటూ వైసిపి నినాదాలు చేశారు.
సభాపతి కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ... వాయిదా తీర్మానం తిరస్కరించాక చర్చకు పట్టుబడటం ఏమిటన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా చర్చకు బిఏసీలో అందరు అంగీకరించారన్నారు.
అంబేడ్కర్ ఆత్మ కూడా క్షోభిస్తుంది
అనంతరం జగన్ మాట్లాడుతూ... అధికార పార్టీ చేష్టలతో సాక్షాత్తూ అంబేడ్కర్ ఆత్మ కూడా క్షోభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు యనమల మాట్లాడుతూ... అంబేడ్కర్ను ప్రతిపక్షం కించపరుస్తోందని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ను కూడా వీరు రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు.
కాల్ మనీ కేసు నిందితుడితో టిడిపి ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లారన్నారు. ఆయన వచ్చారని, చర్యలు ఏవన్నారు. ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ, నిందితుడు తిరిగి రాకపోవడం విడ్డూరమన్నారు. కనీసం ఆ ఎమ్మెల్యేను విచారించలేదన్నారు.
యనమల మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతకు సభా సంప్రదాయాలు తెలియవన్నారు. ఆయనకు సభను అడ్డుకోవడం మాత్రమే తెలుసునని చెప్పారు. జగన్ పదేపదే తమ పార్టీ ఎమ్మెల్యేను నిందితుడు అంటున్నారని.. అసలు సాక్షాత్తు జగనే పదకొండు చార్జీషీట్లలో నిందితుడు అన్నారు. ఆయన ఇక్కడే ఉన్నారన్నారు.
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా చర్చ కేవలం ఇక్కడి అసెంబ్లీలోనే కాదని, పార్లమెంటులోను చర్చ జరిగిందన్నారు. అందుకే దాని పైన అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నామన్నారు. రేపు చర్చకు సిద్ధమని చెప్పారు.
గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ... జగన్ తన పార్టీలో 44 మంది దొంగలను పెట్టుకొని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... బిఏసీలో అంబేడ్కర్ పైన చర్చకు ప్రతిపక్షం అంగీకరించిందని, ఇప్పుడు సభను అడ్డుకోవడం ఏమిటన్నారు. శాసన సభ్యుల పైన తక్షణం సభాపతి చర్యలు తీసుకోవాలని, అప్పుడే సభను కొనసాగించామన్నారు.
కాల్ మనీ పైన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని, రేపు సమగ్రంగా చర్చిద్దామని చెప్పామని, అయినప్పటికీ రాద్దాంతం చేయడం ఏమిటని నరేంద్ర అన్నారు.
అయితే, అధికార పక్షం, టిడిపి ఎంత నచ్చ చెప్పినా ప్రతిపక్ష వైసిపి కాల్ మనీపై చర్చకు పట్టువీడలేదు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో, సభలో గందరగోళం ఏర్పడింది.
చర్యలు తీసుకోండి
సభకు విఘాతం కలిగిస్తున్న సభ్యుల పైన చర్యలు తీసుకోవాలని విప్ కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. కాల్ మనీ పైన చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినప్పటికీ రాద్దాంతం ఏమిటన్నారు. సభలో తీవ్ర గందరగోళం చెలరేగటంతో సభాపతి కోడెల శివప్రసాద రావు శాసన సభను రెండోసారి పది నిమిషాలు వాయిదా వేశారు.
అంబేడ్కర్ పైన వైసిపికి గౌరవం ఉందా: రావెల
అంబేడ్కర్ను ప్రతిపక్షం అవమానిస్తోందని మంత్రి రావెల కిషోర్ బాబు సభ వాయిదా అనంతరం అన్నారు. కాల్ మనీ పైన రేపు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పాక రాద్దాంతం ఎందుకన్నారు. అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకోవడం ద్వారా వైసిపి అంబేడ్కర్ను, దళితులను అవమానిస్తోందన్నారు.