గతంలో సరైన చట్టాలు లేకే: కాల్ మనీపై సవాంగ్, మహిళను ఇంట్లో బంధించిన లాయర్
హైదరాబాద్: అక్రమ వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన చట్టం లేకపోవడం వల్లే గతంలో కాల్ మనీ వ్యాపారుల పైన చర్యలు తీసుకోలేకపోయామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ గురువారం నాడు అన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో గుంటూరు అర్బన్ పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కీలక ప్రాంతాల్లో సోదాలు తూతూ మంత్రంగా జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. బడా వడ్డీ వ్యాపారులను వదిలి చిరు వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు.
కాగా, అవసరాలకు రుణాలు తీసుకుని దారుణ వడ్డీలు చెల్లించలేక బాధితులు కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన శివశంకర్ (36) అధిక వడ్డీలు కట్టలేక తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లాలో వడ్డీవ్యాపారి వేధింపులు తట్టుకోలేక ఒంగోలు కేశవకుంటకు చెందిన ఆటో డ్రైవర్ పి నాగరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురంలోని నవోదయకాలనీలో చిల్లర కొట్టు వ్యాపారం నిర్వహిస్తున్న షఫి చక్ర వడ్డీలు చెల్లించలేక విషం తాగి బలవన్మరణయత్నం చేశాడు.
చిత్తూరు నగరంలో తీసుకున్న అప్పును చెల్లించలేదని ఓ ఆటో డ్రైవర్ భార్యను ఓ లాయర్ ఓ రోజంతా తన ఇంట్లో నిర్బంధించాడు.
కాగా, కట్టలేని వడ్డీ కుటుంబాన్నే కాటికి పంపింది చిత్తూరు జిల్లా ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన శివశంకర్ (36) అధిక వడ్డీలు కట్టలేక తన భార్య లీలావతి, కుమారుడు వినయ్ కుమార్ (8), కుమార్తె కావ్య (6)తో కలిసి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బలవన్మరణానికి ముందు వీరంతా సదుం మండలం యర్రాతివారిపల్లెలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబమంతా కలిసి చివరిసారిగా ఫొటో దిగారు. తిరుగు ప్రయాణంలో యర్రాతివారిపల్లెలోని బీసీ గురుకుల పాఠశాల సమీపంలో సీత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అంతకుముందు తమ చావుకు అధిక వడ్డీలు, అప్పులోళ్ల ఒత్తిడే కారణమంటూ, తమను వేధించిన రుణదాతల పేర్లను ఒక చిన్న పుస్తకంలో రాసి, ద్విచక్రవాహనంలో ఉంచారు. ప్రభుత్వం వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య లేఖలో కోరారు. తమ నలుగురిని ఒకే గుంతాలో పూడ్చాలంటూ ఆ లేఖలో తమ బంధువులకు విజ్ఞప్తి చేశారు.