కాల్ మనీ: జగన్ పార్టీ రాష్ట్ర మహిళా నేత భర్త అరెస్టు
ఏలూరు: కాల్మనీకేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి భర్త ఈడ్పుగంటి నవరాజును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులకు ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
శ్రీలక్ష్మి భర్త నవరాజు, మరికొందరి వద్ద పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పువీధికి చెందిన కలగర శివరామకృష్ణ ప్రసాద్, అతనిభార్య మృణాళిని కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నారు. ఆ రుణానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని, మరికొన్ని ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గత నెల 17న ఏలూరు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు ఫిర్యాదు మేరకు శ్రీలక్ష్మి, నవరాజు, హరి భగవాన్ తదితరులపై కేసు నమోదు చేశారు. కాల్ మనీ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే.