టీడీపీని హడలెత్తిస్తున్న 'కెమెరా': లీకైతే డ్యామేజీ తప్పదని ఇలా?..
ఎన్నికలు ముగిసేదాకా సమావేశాల్లోను వీడియో చిత్రీకరణ నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: మైకులు పట్టుకుంటే నోటికి వచ్చింది మాట్లాడటం కాదు.. జనం మెచ్చేలా మాట్లాడగలగాలి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నవారైతే తన, పర బేధం లేకుండా అందరిని కలుపుకుపోయే మాట తీరు ప్రదర్శించాలి. అలా కాదని.. అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తే.. జనం ముందు వారి తీరును ఎండట్టడానికి 'కెమెరా' కన్ను ఎప్పుడూ సిద్దంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
ఇదంతా ఎందుకు లేని పోని గొడవనుకున్నారో.. మరేమో గానీ టీడీపీ నేతలు ఏకంగా సొంత మీడియాను కూడా తమ సమావేశాలకు అనుమతించడం లేదట. ఇటీవల పార్టీ నేతల వ్యాఖ్యలు వరుసగా వివాదాస్పదమవుతుండటం.. ఆ క్లిప్పింగ్స్ అన్ని మీడియాలో పదేపదే చక్కర్లు కొడుతుండటంతో.. అసలు వీడియోగ్రాఫర్ లేకుండానే సమావేశాలు కానిచ్చేస్తున్నారట.
నంద్యాల ఉపఎన్నికలు ముగిసేదాకా నేతలంతా కెమెరాలకు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నారని, అందువల్లే వీడియోగ్రాఫర్ కనిపిస్తే చాలు.. వద్దంటూ అక్కడినుంచి సాగనంపుతున్నారని చెబుతున్నారు. నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనే భయంతోనే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం తరుపు మీడియా ఆరోపిస్తోంది.
ఇటీవల సీఎం చంద్రబాబు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మరో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. 'నేనిచ్చే పెన్షన్ తీసుకుంటూ, నేనేసిన రోడ్లపై నడుస్తూ.. నాకు కాకుండా మరెవరికీ ఓటేస్తారు, మాకు ఓటేయకపోతే పెన్షన్ తీసుకోవద్దు?' అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు మీడియాలో వాడివేడి చర్చలకు దారి తీశాయి.
ఆ తర్వాత కర్నూలు జిల్లా అధ్యక్షుడు మంత్రి సోమిశెట్టి.. నంద్యాలలో టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్ ఎత్తేస్తామంటూ వ్యాఖ్యానించడం మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాకు లీకవడంతో.. టీడీపీపై నెగటివ్ అభిప్రాయాలు కలిగేలా చేశాయి. దీంతో ఎన్నికలయ్యేవరకు కెమెరాలకు నేతలు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశానికి సొంత పార్టీకి చెందిన లోకల్ వీడియోగ్రాఫర్ ఒకరు రాగా.. వద్దని వారించి మరీ అతన్ని వెనక్కి పంపించారట. విషయం వీడియోగ్రాఫర్ కు అర్థం కాకపోయినా.. ఇదే అసలు విషయమంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అంతేకాదు, సమావేశాల్లో నేతలు సైతం మొబైల్ తో వీడియోలు తీయకుండా.. కొంతమంది ప్రత్యేకంగా వారిని కనిపెట్టుకుని కూర్చుంటున్నారట. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నిక పూర్తయ్యేదాకా టీడీపీకి కెమెరా భయం తప్పేటట్లు లేదు.