అక్కడ పంచాయతీ.!ఇక్కడ పట్టభద్రుల ఎన్నికలు.!మొదలైన ప్రచార వేడి.!రెండు రాష్ట్రాల్లో అదే హడావిడి.!
హైదరాబాద్/అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతూ రోజుకో మలుపు తీరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం వరకూ చేరుకుంది. నాలుగు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికార,ప్రతిపక్షాలకు సవాల్ గా పరిణమించింది. ఇక తెలంగాణలో రెండు పట్ట భద్రుల ఎన్నిక కోసం ప్రచారం జోరందుకుంది. అభ్యర్ధులు రంగంలోకి దిగి వారికి అనుకూలంగా మద్దత్తు కూడ గట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ప్రచారాలతో మరొక్కసారి హడావిడిగా కనిపిస్తున్నాయి.
మళ్లీ ఊపందుకున్న ప్రచార పర్వం..రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన ఎన్నికల సందడి..
తెలంగాణలో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మార్చి 14వ తేదీతో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు పూర్తవుతుంది. ఈ నెలాఖరులోపే మండలి స్థానాలు, ఖమ్మం, వరంగల్ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడిపి పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవడంతో రాష్ట్రంలో మళ్లీ రాజకీయ వేడి మొదలైనట్టు తెలుస్తోంది.
కార్యాచరణ ప్రారంభించిన ప్రధాన పార్టీలు.. మద్దత్తు కూడగట్టుకోవడంతో మునిగిపోయిన ఆశావహులు..
ఉక ఎన్నికలు జరిగే రెండు శాసనమండలి స్థానాల్లో ఒకటి టీఆర్ఎస్, మరొకటి బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో, వాటిని నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానాన్ని దక్కించుకుని ఆధిపత్యం చాటుకోవాలని అధికార టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటిపార్టీ నేత చెరుకు సుధాకర్లు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాల నుంచి ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు కొన్నినెలలుగా ప్రచారం చేస్తున్నారు.
ఊపుమీదున్న బీజేపి.. అవకాశం ఇవ్వొద్దంటున్న గులాబీ పార్టీ..
ఇక దుబ్బాకలో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్లో నలబై ఎనిమిది డివిజన్లు సాధించిన ఉత్సాహంలో ఉన్న బీజేపి వరంగల్ కార్పొరేషన్పై జెండా ఎగరేయాలనే ధ్యేయంతో కార్యాచరణ అమలుచేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వరంగల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే లక్ష్యంతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తూ అందివచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి.
Recommended Video
ఏపీలో అదే ఉత్కంఠ.. మొదలైన పంచాయతీ హడావిడి..
అంతే కాకుండా అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంచాయతీ ఎన్నికలు వాడివేడిగా ముందుకు వెళ్తున్నాయి. పంచయతీ ఎన్నికలను అధికార వైసీపి, ప్రతిపక్ష టీడిపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఉత్కంఠ రెట్టింపయ్యింది. అసలు ఎన్నికలకు అనువైన సమయం కాదని, ఎన్నికల నిర్వహణ ప్రస్తుత సమయంలో అంత శ్రేయస్కరం కాదిని అధికార పలు సందర్బాల్లో ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని తిరస్కరించింది. చివరికి అత్యున్నత న్యాయస్దానం జోక్యంతో ఎన్నికల నిర్వహణ సాద్యపడింది. దీంతో రాజకీయంగా మరింత వేడి రగిల్చిన పంచాయతీ ఎన్నికలు ఏపిలో ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.