డేటా చోరీ అంశం వైసీపి కి శరాఘాతం కానుందా..? జగన్ భవిష్యత్ ప్లాన్ ఏంటి..?
అమరావతి/ హైదరాబాద్ : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సెల్ఫ్గోల్ కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇద్దామంటే అవసరమా అంటూ కొట్టిపారేసారు. కాపుల రిజర్వేషన్ మా వల్ల కాదన్నారు. పార్టీలో సీనియర్ నేతలకు విలువ ఇవ్వకుండా పొమ్మన లేక పొగబెట్టాడనే అపవాదును మూటగట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏకంగా ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైసీపీ ప్రధాన ముద్దాయి అనే ప్రమాదం అంచున నిలబడ్డారు. ఓ టీవీ ఛానల్ ను తాము బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రకటించి మరింత వివాదం కొనితెచ్చుకున్నారు జగన్.
జగన్ వ్యూహం పై పెదవి విరుస్తున్న నాయకులు..! ఏకపక్ష నిర్ణయాలతో నష్టమంటున్న నేతలు..!!
ఇదంతా.. వ్యూహాత్మకమా, తెలిసీ తెలియని తనమా అనేది మాత్రం పార్టీ సీనియర్లకూ అంతుబట్టని విషయంగా మారిందనే చర్చ జరుగుతోంది. పదిరోజులుగా ఐటీ గ్రిడ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది. మొదట దీనిలో నేర కోణంలో చూసినా, క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. చివరకు జగన్ సారథ్యంలోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నాడంటూ టీడీపీ వైపు ఎన్నికల అస్త్రంగా మారింది. దీన్ని ఏపీ జనాల్లోకి తీసుకెళ్లి జగన్ను ముద్దాయిగా నిలిపి, సానుభూతి పొందాలనే వ్యూహానికి టీడీపీ పదను పెడుతుంది.
ఫామ్ 7పై వైసీపి నేతల స్పందన..! పార్టీని ఇరుకున పెడుతున్న ప్రకటనలు..!
అదే జరిగితే, జగన్ చేతులారా కష్టాన్ని కొనితెచ్చుకున్నట్లేనంటూ సీనియర్ నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు. 8 లక్షల ఓట్లు తొలగించమంటూ వైసీపీ తరపున దరఖాస్తులు వచ్చాయని ఆరోపణలున్నాయి. అదే సమయంలో తామే ఫామ్ 7 పూర్తిచేసి ఓట్ల తొలగింపునకు దరఖాస్తుచేశామంటూ స్వయంగా జగన్ అండ్ కో ఒకటికి నాలుగు సార్లు మీడియా ఎదుట చెప్పటం కూడా టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.
ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట
ప్రతిపక్ష పార్టీ కుట్రకు ఆధారాలు ఉన్నాయంటున్న టీడిపి..! వైసీపి ఇరుక్కోక తప్పదా..?
వాస్తవానికి ఓటు ఎందుకు తొలగిస్తారనేది జనం పెద్దగా పట్టించుకోరు. గ్రామీణ ఓటర్లు తమ ఓట్లు పోవటానికి కారణం వైసీపీ అనే అభిప్రాయ పడితే, కోరి ఇబ్బంది తెచ్చుకున్నట్లే అనేది వైసీపీ గుర్తించకపోవటం శోచనీయం. కానీ, ఇంతటి సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తేలికగా వదిలేట్టు కనిపించడం లేదు. జగన్ ఓట్లన్నీ తొలగించి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో చేయి కలిపి ఏపీ కి అన్యాయం చేస్తున్నాడంటూ సెంటిమెంట్ను రగిలించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి దీన్నుంచి జగన్ ఎలా బయటపడతారు. తాము చేసింది వాస్తవమనే విషయాన్ని ఏపీ ప్రజలకు ఎలా చెబుతారనేది వైసీపీ కి ప్రశ్నార్థకంగా మారింది.
దోషులను వదలం..! ప్రజాకోర్టులో నిలబెడతామంటున్న బాబు..!!
ఇదిలా ఉండగా డేటా చోరీ దొంగలు దొరికిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. వైసీపీ యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. అందుకు సంబందించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని అనుకుంటున్నారని, అయినా ఎక్కడో ఒక సాక్ష్యం వదిలేస్తారని చంద్రాబు తెలిపారు. తెలుగుదేశంతో పెట్టుకుంటే ఎవరూ బాగు పడరన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం మాదగ్గర ఉందని పేర్కొన్నారు.