అంతర్వేది ఘటనతో డిఫెన్స్లో జగన్ సర్కార్- బీజేపీ విషయంలో రూటు మారుస్తుందా ?
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ఘం వ్యవహారం ఏపీలో జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత స్ధాయిలో బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అయితే ఇన్నాళ్లూ బీజేపీ విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ విషయంలో వైసీపీ సర్కారు రూటు మార్చేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
రథం - రాజకీయం..
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా హిందువులు సెంటిమెంట్గా భావించే రథం దగ్ధం కావడంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో రాజకీయంగానూ సెగలు మొదలయ్యాయి. మొదట్లో ఈ ఘటనపై తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం ప్రమాదం జరిగిన రెండో రోజు ఆలయ ఈవోను బదిలీ చేసింది. ఆ తర్వాత పరిస్ధితి ఇంకా సద్దుమణగకపోవడంతో ఈవోను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత విపక్షాలు ఏకంగా సీబీఐ, న్యాయవిచారణలు కూడా కోరుతుండటంతో ప్రస్తుతానికి సాగుతున్న పోలీసు విచారణను వేగవంతం చేసింది. ఇలా అంతర్వేది విషయంలో ప్రభుత్వం అనుసరించిన రక్షణాత్మక వైఖరి విపక్షాలకు బలంగా మారిపోయింది.
బీజేపీకి కొత్త ఊపిరి...
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం అత్యంత తక్కువగా కనిపించే ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం పోరాడుతున్న బీజేపీకి రథం దగ్ధం ఘటన పూర్తిగా కలిసివచ్చింది. అయితే బీజేపీ కూడా ఈ ఘటనను తొలి రోజే పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయింది. రెండోరోజు అంతర్వేది ఘటన పరిశీలనకు వచ్చిన మంత్రులను స్వామీజీలు, హిందూ సంస్ధలు అడ్డుకున్న తర్వాత ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు బీజేపీతో పాటు మిత్రపక్షం జనసేన నాయకులను కూడా హౌస్ అరెస్టులు, బైండోవర్లు చేయడంతో ఇక ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పరిస్ధితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు చివరికి బీజేపీ నేత సోము వీర్రాజు అంతర్వేది వెళ్లేందుకు అనుమతిచ్చారు. దీంతో ప్రభుత్వానికి కాస్త నష్ట నివారణ జరగగా... బీజేపీకి మాత్రం అనుకున్నదాని కంటే ఎక్కువ మైలేజే వచ్చింది.
బీజేపీ విషయంలో జగన్..
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా బీజేపీ నేతల విమర్శలకు స్పందించకుండా సీఎం జగన్ సంయమనం పాటిస్తూ వస్తున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు కూడా సందర్భాన్ని బట్టి మాత్రమే విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్న రెండు సమస్యలకు కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. జగన్ సర్కారు నిర్ణయంపై బీజేపీ నేతలు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు కూడా చేశారు. కానీ అంతలోనే అంతర్వేది ఘటన జరగడంతో అప్పటివరకూ పొగిడిన బీజేపీ నేతలే ఇప్పుడు జగన్ సర్కారు ఓ మతానికి కొమ్ము కాస్తోందంటూ విమర్శలకు దిగుతున్నారు.
Recommended Video
కాషాయంపై కఠిన వైఖరేనా ?
అధికారంలోకి వచ్చి ఏఢాదిన్నర పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కారు ఇప్పటివరకూ బీజేపీ నేతలపై పెద్దగా విమర్శలు చేసింది లేదు. ఆ మాట కొస్తే బీజేపీ చేసే విమర్శలకు కూడా వైసీపీ నేతలు సీరియస్గా తీసుకుని స్పందించిన దాఖలాలు కూడా కనిపించవు. కానీ అంతర్వేది ఘటనలో మాత్రం బీజేపీ నేతలకు హిందూ సంస్ధల సెగ తాకింది. వీహెచ్పీ, ఆరెస్సెస్ నేతలు బీజేపీ సాఫ్ట్ కార్నర్పై అంతర్గంతగా ఫైర్ అవుతుండటంతో బీజేపీ కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. దీంతో ఈ వ్యవహారంలో రెచ్చగొట్టిన కాషాయ నేతలందరిపైనా కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొందరిని ఇప్పటికే కేసులు పెట్టి కోర్టుల్లో ప్రవేశపెట్టినట్లు నిన్న సోము వీర్రాజు ప్రకటించారు. అంతర్వేది ఘటన వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బీజేపీ నోరు మూయించడంతో పాటు భవిష్యత్తులో కాషాయ నేతల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.