సమస్యల వలయంలో జగన్ సర్కార్.. మేలో ఏపీ రాజధాని తరలింపు సాధ్యమేనా..!
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారతాయా, కీలక సమస్యల పరిష్కారం చేయకుండా రాజధాని తరలింపు సాధ్యమేనా, మండలి రద్దు కాకుంటే మేలోపు విశాఖకు వెళ్లడం అయ్యే పనేనా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం కావడమొక్కటే జగన్ సర్కారుకు ఊరటగా కనిపిస్తోంది.
మండలి రద్దు అయ్యేనా ?
ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పేరుతో పెండింగ్ లో పెట్టిన శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ కేంద్రానికి తీర్మానం చేసి పంపింది. అయితే ఇంతవరకూ దాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని, ఆ మేరకు అమిత్ షా హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నా ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు. కాబట్టి మండలి రద్దు వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి నెలకొంది. దీనిపై కేంద్రం వద్ద లాబీయింగ్ చేయాలన్నా సీఎం జగన్ రాష్ట్రంలో మిగతా పరిస్ధితులపైనే దృష్టిపెట్టాల్సిన పరిస్ధితులు ఉన్నాయి.
తరలింపు జీవోలు హైకోర్టులో పెండింగ్..
ఏపీ సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కార్యాలయాలను రెండింటిని కర్నూలుకు తరలిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఇచ్చిన ఆదేశాలు సైతం వివాదాస్పదమయ్యాయి. వీటిపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు విచారణ జరిపినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. మరోవైపు తమ అనుమతి లేకుండా కార్యాలయాలను తరలిస్తే దానికి అయిన ఖర్చును సదరు అధికారుల నుంచే వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరికలు కూడా చేసింది. దీంతో కార్యాలయాల తరలింపును జీవోల ద్వారా చేపట్టే పరిస్ధితి కనిపించడం లేదు.
స్ధానిక ఎన్నికల వాయిదా, బడ్జెట్
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికలకు ఆరు వారాలకు వాయిదా పడ్డాయి. ఆరువారాలని చెబుతున్నా మూడు నెలలు పడుతుందని అనధికార వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించలేని పరిస్ధితి. ఈ నెలాఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్డెట్ కచ్చితంగా ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోవాల్సిందే. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖర్చులకు కూడా అనుమతి ఉండదు. మరోవైపు ఎన్నికల నిర్వహణ సగంలో నిలిచిపోవడంతో ఎన్నికల కోడ్ తొలగిపోయినా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా మారింది. రాజధాని తరలింపులోనూ ఈసీ అభ్యంతరాలు చెబితే ఇక సమస్యల్లో చిక్కుకున్నట్లే.
ఉన్నంతలో ఊరట ఉద్యోగులే...
రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని తరలింపు విషయంలో పలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు అంగీకరించడం ఒక్కటే ఊరటగా కనిపిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న దాదాపు 3500 మంది ఉద్యోగులు విశాఖకు సై అనే పరిస్దితి ఉంది. తాజాగా సమావేశమైన ఉద్యోగులు మే నెల ముగిసేలోపు తమను విశాఖ తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల తరలింపు విషయంలోనూ అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం కోరినట్లుగా పనిచేయడం వారికి తప్పనిసరి కావడంతో ఈ విషయంలో ప్రభుత్వానికి సమస్య లేనట్లే.
మేలోపు తరలింపు సాధ్యమేనా ?
మే నెల లోపు అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించాలంటే ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి, కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో వ్యవస్ధలన్నీ స్తంభింప చేయాల్సిన పరిస్ధితి, మొన్న ఎన్నికలు వాయిదా పడితే, ఆ తర్వాత గుళ్లు తాజాగా స్కూళ్లు, కాలేజీలు మూత పడుతున్నాయి. దీంతో రేపు ఎన్నికల నిర్వహణే కాదు రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్ధితులు వస్తాయోమేనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆ లోపు పార్లమెంటులో మండలి రద్దు బిల్లు ఆమోదం పూర్తి కావాల్సి ఉంది.. కనీసం ఏప్రిల్ చివరి నాటికి సమస్యల వలయం నుంచి బయటపడినా మే నెలలో హుటాహుటిన తరలింపు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.