అందరిని అంత కాలం మోసం చేయలేరు..! బిర్యానీలో ఫేక్ బల్లి బాగోతం బయటపెట్టిన పోలీసులు..!!
గుంతకల్లు/హైదరాబాద్ : కొందరిని కొంతకాలమే మోసం చేయగలం. అందరిని అంతకాలం మోసం చేయలేం. మోసం చేసే క్రమంలో చేసే చిన్న తప్పిదం జీవిత కాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. డబ్బు సంపాదనకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడో ప్రబుద్ధుడు. దానినే వృత్తిగా మలచుకొన్నాడు. సోమవారం కూడా అలాగే మోసం చేయాలని ప్రయత్నించాడు.. అయితే అధికారుల అప్రమత్తతతో మోసగాడి పన్నాగం బయటపడింది.
ముంబయిలోని చెంబూర్ ప్రాంతంలో నివాసముండే సుందర్పార్ (65) అనేవ్యక్తి సోమవారం రైలులో కోయంబత్తూరుకు వెళుతూ గుంతకల్లు జంక్షన్లో దిగాడు. నాలుగో నెంబరు ప్లాట్ఫారంలో ఉన్న క్యాటరింగ్ స్టాల్కు వెళ్లి వెజిటబుల్ బిరియానీ కొని అక్కడే తిన్నాడు. బిరియానీలో బల్లి ఉందని, దాన్ని తినడంతో అస్వస్థతకు గురయ్యానని హోటల్ యజమానికి చెప్పాడు. విషయం తెలియడంతో రైల్వే వైద్యులు వచ్చి ఆయనకు వైద్యం అందించారు. ఈ విషయాన్ని తాను వివాదం చేస్తానని చెప్పడంతో హోటల్ యజమాని అతనికి 5 వేల రూపాయలు అందజేశాడు.ఇక విషయం తెలియగానే సహాయ డివిజనల్ కమర్షియల్ మేనేజరు ఉదయ్కుమార్, రైల్వే రక్షణదళం అధికారులు విచారణ చేపట్టారు.
బల్లిపడిన బిరియానీని తినడంవల్ల అనారోగ్యానికి గురయ్యాయని సుందర్పార్ నమ్మబలికాడు. అయితే ఇదేవ్యక్తి మూడ్రోజుల కిందట జబల్పూర్లో ఇదేవిధంగా సమోసాలో బల్లి ఉందని చెప్పి 50 వేల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు.. అక్కడ పట్టుబడ్డ ఫొటోలు, సమోసాలో బల్లిని పోలిన చేప సగం ఉన్న ఫొటోలను అధికారులు సేకరించారు. అక్కడ మిగిలిన సగం చేపను గుంతకల్లులో బిరియానీలో ఉంచి బల్లి పడినట్లు నాటకమాడాడని గుర్తించారు.
బతుకుదెరువు కోసం ఈ విధంగా బల్లిని పోలిన చేపను భోజనంలో పెట్టి బెదిరించి డబ్బు వసూలు చేసుకుని వెళుతుంటాడని అధికారులు చెప్పారు. రైల్వేలోని క్యాటరింగ్ విభాగాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు వివరించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ డి.సి.ఎం. ప్రశాంత్కుమార్ చెప్పారు. ఇలాంటి వారి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.