తప్పుడు ప్రచారం అడ్డుకోలేరా ? టీటీడీ భూముల విషయంలో సీఎం జగన్ సీరియస్
టీటీడీ భూముల విక్రయాల విషయంలో ఏపీ ప్రభుత్వం వివాదానికి చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది . టీటీడీ భూముల విక్రయాలకు సంబంధించి అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజా వివాదం నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నా ఏం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు .
Recommended Video
టీటీడీ భూముల అమ్మక తీర్మానం నిలిపివేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వివాదానికి చెక్ !!
అధికారులపై సీఎం జగన్ అసహనం
అమ్మకానికి తిరుమల అంటూ ఏకంగా తిరుమలనే జగన్ ప్రభుత్వం అమ్మేస్తోంది అంటూ ఏపీలో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు మొదలుపెట్టారు. సేవ్ టీటీడీ ఫ్రమ్ జగన్ అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విరుచుకు పడిన పరిస్థితి . ఏపీలో అధికార వైసీపీ హిందూ వ్యతిరేక ప్రభుత్వం అన్న భావన ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. పదేపదే అలాంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారని , ప్రభుత్వాన్ని ఎందుకు అప్రదిష్ట పాలు చేస్తున్నారని సీఎం జగన్ అధికారుల తీరుపై మండిపడ్డారు .
తప్పుడు ప్రచారం చేస్తోంటే కట్టడి చేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫైర్
టీటీడీ భూముల అమ్మకం ప్రక్రియను నిలుపుదల చేస్తూ జీవో విడుదల చేసి వివాదానికి తెరదించినా ఈ వ్యవహారంలో మాత్రం సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయ్యారు.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను చూపుతూ తిప్పి కొట్టటం సాధ్యం కాలేదా అని మండిపడ్డారని సమాచారం. ఏపీ ప్రభుత్వంపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోంటే కట్టడి చేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ సహా దేవదాయ శాఖ భూముల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దన్న సీఎం
వివాదాలకు కారణం అయ్యేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొన్నారు . టీటీడీ సహా దేవదాయ శాఖ భూముల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇదే విషయం జనాల్లోకి వెళ్ళేలా చూడాలని అధికారులకు జగన్ సూచించారు. లేని అంశాలను అదే పనిగా ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టకు గురి చేస్తోన్న పార్టీలు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారంలో ఉండి కూడా ఏది వాస్తవమో చెప్పలేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు .
ఆలయ ఆస్తులను అమ్మకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆందోళన
తిరుమల శ్రీవారి స్థాయిని దిగజార్చే చర్యలు టీటీడీ మానుకోవాలని ఇప్పటికే ఆగ్రహ జ్వాలలు మిన్ను ముడుతున్నాయి.ఆలయ భూములకు భద్రత కల్పించాలని ఆలయ ఆస్తులను అమ్మకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీలో తాజా వివాదంతో భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ ఆలయ భూముల అమ్మక తీర్మానాన్ని నిలిపివేసినా , ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతున్న తీరు జగన్ కు , అధికార వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.