క్యాన్సర్కి మందు ఉంది, అసూయతో వచ్చే కడుపుమంటకు కాదు: చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు
వయసు మళ్లితే చికిత్స ఉంటుంది.. కానీ మెదడు మళ్లితే చికిత్స లేనే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని.. క్యాన్సర్ రక్కసికి కూడా చికిత్స ఉందని చెప్పారు. కానీ ఆసూయతో వచ్చే కడుపుమంటకు మాత్రం చికిత్స లేదని వివరించారు. అక్కసుతో ఉండేవారిని బాగుచేసే మందులు ఎక్కడా లేవని జగన్ గుర్తుచేశారు. మంగళవారం కర్నూలులో మూడో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూసి ఓర్చుకోలేని చంద్రబాబు కడుపు మండిపోతోందని విమర్శించారు.
85 శాతం హామీలు అమలు..
ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూ ముందుకుసాగుతున్నామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయంపై దృష్టిసారించామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను అమలు చేశామని వివరించారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు నాడు-నేడు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించబోతున్నామని జగన్ స్పష్టంచేశారు. మరో మూడేళ్లలో ఆస్పత్రులు కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకోసం 15 వేల 335 కోట్లు వ్యయం చేయబోతున్నామని వివరించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా..
ఇప్పటికే ఉన్న ఆస్పత్రులను ఆధునీకరిస్తామని, కొత్త నిర్మించే హాస్పిటల్స్ ఇళ్లకు సమీపంలోనే నిర్మిస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. ప్రతీ ప్రభుత్వాసుపత్రిని ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్ట్స్ మేరకు మార్చుతామని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని.. మెడికల్ కాలేజీ రూపురేఖలను సముూలంగా మారుస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా కమ్యూనిటీ సెంటర్, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ.. ఇలా అన్నింటినీ మారుస్తామని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి.. భవిష్యత్లో ఎలా మారబోతున్నాయో ఫోటోలు తీసి చూపిస్తామని పేర్కొన్నారు.
మరో 16 మెడికల్ కాలేజీ..
రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. మరో 16 ఏర్పాటు చేస్తామని.. దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య 27కి చేరుతుందన్నారు. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీ చదివే స్టూడెంట్స్, వైద్యులు ఉంటారని చెప్పారు. దీంతో ఏదైనా వ్యాధితో మెడికల్ కాలేజీకి వస్తే సరైన చికిత్స అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యులతోపాటు నర్సులు కూడా ఉంటారని.. వైద్యులు లేరు అనే మాట ఉండకూడదనే ఉద్దేశంతో మరో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని జగన్ వివరించారు.
అవ్వ-తాతలకు కంటి పరీక్షలు..
అవ్వ-తాతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మూడో దశ కంటి వెలుగును శ్రీకారం చుట్టామని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడుతో వైద్యం, కంటి వెలుగు రెండు పథకాలు కర్నూలు నుంచి ప్రారంభించామని తెలిపారు. జూలై 30వ తేదీ వరకు మూడో దశ కంటి వెలుగు పథకం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 56 లక్షల 86 వేల 420 మందికి అవ్వ తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. పరీక్ష చేసి అవసరమైన వారికి కళ్ల జోడు కూడా అందజేస్తామని తెలిపారు. గ్రామ వాలంటీర్ మీ ఇంటికొచ్చి చేతిలో కళ్లజోడు పెడతారని తెలిపారు. వైద్యులు పరీక్షించగా.. ఆపరేషన్ చేయాలని కోరితే మార్చి 1 తేదీ నుంచి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Recommended Video
46 వేల మంది చిన్నారులు..
మూడో దశ కంటి వెలుగును 133 కేంద్రాల్లో నిర్వహిస్తామని జగన్ గుర్తుచేశారు. వైద్య సిబ్బందితోపాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా భాగస్వాములవుతారని చెప్పారు. కంటి వెలుగు కోసం రూ.561 కోట్లు వ్యయం చేయబోతున్నామని తెలిపారు. 2019 అక్టోబర్ 10వ తేదీన మొదటి విడత కంటి వెలుగును ప్రారంభించామని జగన్ గుర్తుచేశారు. 66 లక్షల చిన్నారులకు 60 వేల మంది సిబ్బంది పరీక్షలు నిర్వహించారని చెప్పారు. నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండో దశ కంటి వెలుగును చేపట్టామన్నారు. 500 నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించారని జగన్ తెలిపారు. 4 లక్షల 36 వేల మందికి పరీక్షలు చేశామని.. రెండోసారి పరీక్ష చేసి 1.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని వివరించారు. 46 వేల మంది పిల్లలకు శస్త్రచికిత్స అవసరమవుతుందని వైద్యులు తెలిపారని.. వేసవి సెలవుల్లో వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు.