ఏపీ స్ధానిక పోరులో అభ్యర్ధులకు సవతి పోరు.. ఎక్కడెలా ముంచుతుందో తెలియక టెన్షన్..
ఏపీ స్ధానిక ఎన్నికల్లో అభ్యర్ధులకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రత్యర్ధులతో పాటు మరో కొత్త ప్రత్యర్ధి పరిచయం కానున్నారు. ఆ ప్రత్యర్ధి ఇతర ప్రత్యర్ధుల్లా కాకుండా సైలెంట్ గా ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో అభ్యర్ధుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అయితే కనిపించే ప్రత్యర్ధులతో కంటే ఈ కొత్త ప్రత్యర్ధితోనే ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్దితి వారికి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ప్రత్యర్ధి ఎవరు, వారి ప్రభావమెంత తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏపీలో హోరాహోరీగా స్ధానిక పోరు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పలుచోట్ల దాడులు, కిడ్నాప్ లు, బ్లాక్ మెయిలింగ్ లు ఎదురవుతున్నా అభ్యర్ధులు మాత్రం ఎవరి స్టైల్లో వారు నామినేషన్ల దాఖలుతో పాటు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్ధి సత్తా ఆధారంగా కొంత, తమ బలాల ఆధారంగా మరికొంత హోమ్ వర్క్ చేసుకుని అభ్యర్ధులు ప్రచారం కొనసాగిస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియగా... మిగతా ఎన్నికలకు ఇంకా జరగాల్సి ఉంది.
ఎన్నికల్లో కొత్త ప్రత్యర్ధి..
ఇప్పటివరకూ స్ధానిక పోరులో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు వారి ప్రత్యర్ధుల రూపంలోనే పోటీ ఎదురైంది. కానీ ఇప్పుడు వారికి మరో కొత్త ప్రత్యర్ధి ఎదురైంది. అదే నోటా ఆప్షన్. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా ప్రభావం చూపిన నోటా ఆప్షన్ ను ఎన్నికల సంఘం ఏపీ స్ధానిక పోరులో తొలిసారి పరీక్షిస్తోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల కంటే నోటాకు వచ్చిన ఓట్ల శాతమే ఎక్కువ. అంటే రెండు జాతీయ పార్టీలను దాటి ఎక్కువ ఓట్లను నోటా సాధించగలిగింది. ఇప్పుడు స్ధానిక పోరులోనూ నోటా ఆప్షన్ రావడంతో దాని ప్రభావంపై అప్పుడే అభ్యర్దుల్లో టెన్షన్ మొదలైంది.
బ్యాలట్ పేపర్లపై నోటా ఆప్షన్..
ఇప్పటివరకూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోరులో ఈవీఎంలపై కనిపించిన నోటా ఆప్షన్ ఈసారి స్ధానిక ఎన్నికల బ్యాలట్ పేపర్లపైకి చేరుతోంది. దీంతో అభ్యర్ధుల పార్టీ గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్ధుల గుర్తుల తర్వాత చివర్లో నోటా ఆప్షన్ ఇస్తారన్నమాట. దీంతో అభ్యర్ధులకు ఓటు వేసేటప్పుడు ఓటర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా కొట్టినా నోటా ఆప్షన్ పై బ్యాలట్ గుర్తు పడిపోతుంది. ఆ తర్వాత అభ్యర్ధులు లబోదిబోమన్నా ప్రయోజనం లేదు. దీంతో ఇప్పుడు ఉన్న ప్రత్యర్ధులకు తోడు ఈ కొత్త ప్రత్యర్ధి సమస్యను అభ్యర్ధులు ఎదుర్కోక తప్పదు.
అసలే హోరాహోరీ ఆపై నోటా...
సార్వత్రిక ఎన్నికల పోరుతో పోలిస్తే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి. చాలా చోట్ల పోటీ చేసే అభ్యర్ధులు కూడా ఎక్కువగా ఉంటారు. పార్టీలు నిలబెట్టిన అభ్యర్దులతో పాటు ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉంటారు. దీంతో ఓట్లలో చీలిక కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పది ఓట్ల కోసం అభ్యర్ధులు నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. ప్రతీ ఓటరునూ తమవైపుకు తిప్పుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో అన్ని ప్రయత్నాలు చేసి ఓటర్లను ఆకట్టుకుని వారిని పోలింగ్ బూత్ ల వరకూ రప్పించిన తర్వాత వారు ఓటు తమ గుర్తుకు బదులు పొరబాటున నోటాకు వేశారంటే మొత్తం లెక్కలు తారుమారు అవుతాయి. అప్పుడు ఫలితాలు కూడా పూర్తిగా మారిపోతాయి. దీంతో ఇప్పుడు అభ్యర్ధులకు నోటా టెన్షన్ పట్టుకుంది. అయితే ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధన కావడంతో అభ్యర్దులు కూడా కిక్కురుమనకుండా ఉండిపోవాల్సిన పరిస్ధితి. పడే నాలుగు ఓట్లను అప్రమత్తంగా తమకే వేసేలా ఓటర్లను చైతన్యవంతం చేయడం మినహా అభ్యర్ధులు కూడా చేయగలిగిందేమీ లేదు.