Amaravati: కొవ్వొత్తుల ర్యాలీ: అమరావతి రైతులు త్యాగజీవులు: అసెంబ్లీ కూడా విశాఖకే: టీడీపీ నేత..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వేర్వేరు రూపాల్లో ఉధృతమౌతున్నాయి. ఇప్పటికే సకల జనుల సమ్మెను చేపట్టారు. రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ను పాటించారు. ఈ సారి వారు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
ఆగని నిరసనల పర్వం..
తుళ్లూరులో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందలాది మంది మహిళలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని కొవ్వొత్తులను పట్టుకుని బారులు తీరారు. ప్రదర్శన నిర్వహించారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేశారు. తుళ్లూరు సహా ఎర్రబాలెం, నీరుకొండ, మందడం, వెలగపూడి గ్రామాల్లో రిలేదీక్షలు కొనసాగుతూనే వస్తున్నాయి.
వర్ల రామయ్య సంఘీభావం..
తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాకు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విషప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. రైతుల నిరసనలకు టీడీపీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ కూడా తరలిస్తారు..
ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అసెంబ్లీని కూడా విశాఖపట్నానికే తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంత రైతుల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రైతులు త్యాగజీవులు అని, తమ కుటుంబానికి ఆధారమైన పంట పొలాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో పెట్టారని అన్నారు.
ఉద్దండరాయుని పాలెంలో దీక్షలు..
రాజధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలోనూ మహిళలు నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్దండరాయునిపాలేనికి చేరుకున్న మహిళలు.. అక్కడ పూజలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చేలా చేయాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే- నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. వైఎస్ జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.