ఏపీ న్యాయవాదులకు ఎదురుదెబ్బ... హైకోర్టు విభజనపై జోక్యం ఉండబోదన్న సుప్రీం
ఉమ్మడి హైకోర్టు విభజన సరికాదంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను జస్టిస్ సిక్రీ, జస్టిస్ నజీర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టును విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణ చేసిన జస్టిస్ సిక్రీ బెంచ్ పిటిషన్ను కొట్టివేసింది.
హైదరాబాదు నుంచి హైకోర్టు నుంచి తరలించేందుకు ఇంకాస్త సమయం కావాలని న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్లకు వేర్వేరు హైకోర్టులు కేటాయించడం జరిగిందని చెప్పిన న్యాయస్థానం... పనులు కూడా ప్రారంభమయ్యాయని వెల్లడించింది. న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం కూడా పూర్తయినందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఏపీ ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అంతే తప్ప మరింత సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే హైకోర్టు విభజన చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసిందని ఇప్పుడేమో హైకోర్టు విభజన ఎందుకు అంత హడావుడిగా చేయాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నిచడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి. అప్పుడు హైకోర్టు రాష్ట్రానికి కావలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఎదురు ప్రశ్న వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు హైకోర్టు ఏపీకి రావడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.