రాజధాని అమరావతి అవినీతిమయం.. ఒక కుంభకోణం ... లెక్క తేలాల్సిందే అంటున్న జగన్ సర్కార్
ఏపీ రాజధాని అమరావతి పై నీలి నీడలు కమ్ముకున్నాయా ? రాజధాని అమరావతి పై జరిగిన సమీక్షా సమావేశంలో ఏం జరిగింది ? రాజధాని నిర్మాణం అంతా అవినీతి మయమని భావిస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ ఏం చెయ్యబోతుంది? జగన్ నెక్స్ట్ అడుగు రాజధాని మీదే పడబోతుందా ? అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది.
రాజధాని అమరావతిపై జగన్ సమీక్షా సమావేశం .. రాజధాని అవినీతి పుట్ట అని చర్చ
రాజధాని అమరావతి పై జరిగిన సమీక్షా సమావేశంలో రాజధాని నిర్మాణంలో భూసేకరణ నుండి జరిగిన అవకతవకలపై లోతైన సమీక్ష జరిగింది. రాజధాని సమీక్షా సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సమీక్షా సమావేశంపై మున్సిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యన్నారాయణ స్పందించారు. రాజధాని అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి బొత్సా వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని బొత్సా సత్యన్నారాయణ తెలిపారు.
రాజధాని నిర్మాణంలో జరిగిన కుంభకోణం వివరాలు తేలాకే రాజధాని అభివృద్ధి
గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని బొత్సా స్పష్టం చేశారు. బలవంతపు భూసేకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స చెప్పారు. మరి ఇలా జరిగిన భూసేకరణ విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన సాగిస్తుంది. రాజధాని అంతా అక్రమాల పుట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు . ఇక రాజధాని నిర్మాణంలో జరిగిన కుంభకోణం వివరాలు తేలాక రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ నెక్స్ట్ టార్గెట్ రాజధాని అమరావతి .. అవినీతిపై సమగ్ర విచారణ
రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని.. రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారన్నారు. తమకు కావాల్సిన వాళ్లకు అనుకూలంగా.. పేదలకు మాత్రం ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారని చెప్పారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపాకే రాజధాని అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలే సంచలనం అయితే సీఎం జగన్ మరో సంచలన నిర్ణయానికి జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని విషయంలో కూడా జగన్ గత పాలక ప్రభుత్వంపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయానికి వచ్చినట్టు ఈ సమీక్ష ద్వారా అర్ధం అవుతుంది. ఏపీ రాజధానిని 33 వేల ఎకరాలను కుదించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తక్కువ ప్రాంతంలో అవసరమైన భవనాలు మాత్రమే ఏర్పాటుచేసి పరిపాలనపై ప్రధాన దృష్టిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.