ఉధృతంగా రాజధాని అమరావతి ఉద్యమం..ఐడీ కార్డులు ఉంటేనే ఆ గ్రామాల్లోకి అనుమతి.. సర్కార్ నిర్ణయం
ఏపీలో రాజధాని అమరావతి కోసం ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు 250 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి ఉద్యమం 250 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి రైతు ఉద్యమాన్ని పట్టించుకోకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి రైతు దీక్షలు తీసుకున్న రాజధాని రైతులు, మహిళలు
తాజాగా నేడు అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అమరావతి రైతు దీక్షలు తీసుకున్నారు రాజధాని రైతులు, మహిళలు. నేటి నుండి 300 వరోజు వరకు ఆకుపచ్చ కండువాతో రైతు దీక్షలు కొనసాగించనున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లో అమరావతి కాలర్ ట్యూన్స్ ఏర్పాటు చేసుకోవాలని, హలో కి బదులుగా జై అమరావతి అనాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో సాగులో ఉన్న భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి కోసం తాము ఇచ్చామని కానీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వారంటున్నారు .
రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల క్లారిటీ .. పట్టు వీడని అమరావతి రైతులు
రాజధాని ప్రాంత రైతులు, ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసి పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమరావతి పూర్తిగా ఉనికిని కోల్పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోవాలని , రాజధానిగా అమరావతినే కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోతుంది. రాజధాని ఏర్పాటు విషయంలో జోక్యం చేసుకోబోమని , రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రం పరిధిలోనిదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది . అయినా సరే రాజధాని అమరావతి రైతులు మాత్రం తమ పట్టు వీడకుండా ఆందోళనలను ఉధృతం చెయ్యాలని భావిస్తున్నారు .
భారీ ఆందోళనలకు నిర్ణయం .. అప్రమత్తపైన ప్రభుత్వం
భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయం తీసుకున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని అమరావతి ఉద్యమంపై ఇప్పటికే నిఘా వర్గాలతో పాటు పోలీసులు దృష్టిపెట్టారు. ఇక తాజాగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ప్రజలంతా అమరావతి ఉద్యమానికి మద్దతుగా పోరాడాలని పలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలలోకి ఐడి కార్డులు లేకుంటే అనుమతించకూడదని నిర్ణయించింది.
ఐడీ కార్డులు ఉంటేనే రాజధాని గ్రామాల్లోకి అనుమతి
రాజధాని గ్రామాల్లోకి ఎవరు అడుగుపెట్టాలన్నా సరే ఐడి కార్డులు చూపించి వెళ్లాల్సిందే. ఇక అంతేకాదు గ్రామాల్లోకి వెళ్తున్న వాహనాలను,వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. బారికేడ్లను పెట్టి ఎక్కడి వారిని అక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై రాజధాని ప్రాంత ప్రజలు,వారికి మద్దతునిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వ నిరంకుశవైఖరి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.