రాజధానిలో రెచ్చిపోతున్న కంకర దొంగలు .. దోపిడీ వెనుక వారు .. సుమోటో గా విచారణ కోరిన అమరావతి జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ల తవ్వకం యధేచ్చగా కొనసాగుతుంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ఉనికి ప్రశ్నార్థకం కాగా, ఇక తాజాగా రోడ్లు సైతం తవ్వి కంకర మాయం చేస్తున్న ఉదంతాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అమరావతిలో రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో కంకర దొంగలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. రోడ్లను తవ్వి కంకర తరలించుకుపోతున్న అక్రమార్కుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ మన్యం మైనింగ్ మాఫియాపై మావోయిస్ట్ నేత గణేష్ లేఖ .. వాళ్ళను తరిమికొట్టాలని పిలుపు
మోదుగ లింగాయపాలెం వద్ద రోడ్డు తవ్వి కంకర తరలించిన దుండగులు
మొన్నటికి మొన్న ఉద్దండరాయునిపాలెంలో రోడ్లను తవ్వేసి కంకర ,ఇసుకను తరలించుకు వెళ్లారు దుండగులు. ఇక ఈ సంఘటన మర్చిపోకముందే తాజాగా మోదుగు లింగాయపాలెంలో రోడ్డును తవ్వి కంకర మాయం చేశారు. మోదుగ లింగాయపాలెం గ్రామానికి ఉత్తరంగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డు మీద వేసిన గుర్తుతెలియని దుండగులు కంకరను తరలించారు. నాలుగు అడుగుల లోతు, రెండు వందల మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిలో రోడ్ల విధ్వంసంపై మండిపడుతున్న అమరావతి దళిత జేఏసీ
పెద్దగా జనసంచారం ఉండని ఈ ప్రాంతంలో అక్రమార్కులు యధేచ్చగా టిప్పర్లు జెసిబి లతో రోడ్లను తవ్వి కంకరను తరలించారు. ఇక అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు ఈ ఘటన జరిగి ఉంటుందని, ఇది పది రోజుల క్రితమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా రాజధాని అమరావతిలో రోడ్లను తవ్వుతూ, రాజధానిలో విధ్వంసం చేస్తున్న ఘటనపై అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్విన ప్రాంతానికి వచ్చి పరిశీలించిన వారు అధికార పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతల కనుసన్నల్లోనే అంటూ అమరావతి జేఏసీ ఆగ్రహం
వైసీపీ నేతల కనుసన్నల్లోనే రోడ్ల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రాజధాని అమరావతిలో రోడ్లను ధ్వంసం చేస్తూ నామరూపాల్లేకుండా చేస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న అమరావతి జేఏసీ నాయకులు రోడ్ల తవ్వకాలు, నిర్మాణ సామాగ్రి చోరీ అంశాలపై కూడా న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని భావించారు. ఈ క్రమంలోనే అమరావతిలో నిర్మాణాల కోసం ఇసుక, కంకర, స్టీల్ అన్ని సమకూర్చుకున్నారు.
Recommended Video
జగన్ సర్కార్ హయాంలో రాజధానిలో దోపిడీ దొంగల హల్చల్ .. ఏకంగా రోడ్లే మాయం
సడన్ గా గత ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వం మారడం, ఆ తర్వాత రాజధానిలో నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో అమరావతిలో నిర్మాణాల కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ రోడ్ల పక్కనే ఉండిపోయింది. దీంతో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్ల పక్కన నిల్వ ఉన్న నిర్మాణ సామాగ్రి తో పాటు, ఏకంగా రోడ్లనే తవ్వేసి దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. టిప్పర్లు, జెసిబిలతో పెద్ద ఎత్తున రోడ్లకు రోడ్లనే మాయం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలో రోడ్లను తవ్విన ఘటన తర్వాత తాజాగా మోదుగ లింగాయపాలెం వద్ద రోడ్లను తవ్వేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.