ఏపీలో మూడు పార్టీలాట: రాజధాని రగడ.. హైకోర్టు పంచాయితీతో రాజకీయ మంటలు
ఏపీలో రాజధాని విషయంలో మూడు పార్టీలాట కొనసాగుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతి పై నీలి నీడలు కమ్ముకున్నాయి. రోజుకో రకంగా రాజధాని అమరావతి కథ మలుపు తిరిగింది. ఇక తాజాగా ఇండియా మ్యాప్ లో రాజధాని అమరావతి లేకపోవడం అధికారపార్టీకి టిడిపిని టార్గెట్ చేయడానికి ఒక కారణమైంది. ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని పై, ఏపీ హైకోర్టు పై చేసిన వ్యాఖ్యలు రాయలసీమ వాసుల ఆగ్రహానికి కారణం కాగా, అధికార పార్టీ ఆరోపణలకు చెక్ పెట్టడానికి టిడిపి నేతలు చలో అమరావతి అంటూ రాజధాని బాట పట్టారు. మూడు పార్టీలు ఒకరిమీద ఒకరు మాటల తూటాలు పేల్చు కుంటూ రాజధాని రగడ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
అమరావతిపై వైసీపీ మంత్రి వ్యాఖ్యలు ... కౌంటర్ గా టీడీపీ రాజధాని యాత్ర
అమరావతి పై గెజిట్ నోటిఫికేషన్ లేదని, దేశ చిత్రపటంలో అమరావతి కి స్థానం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీలో మరోమారు రాజధాని అంశం పై దుమారం రేపాయి. ఇక అంతే కాదు అమరావతి పీటర్ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిని తరలిస్తారన్న అనుమానంతో టిడిపి సైతం వైసీపీ పై రాజధాని అంశాల్లో యుద్ధం ప్రకటించింది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని, నిర్మాణాలు లేవని ,అంతా ఇన్ సైడర్ ట్రేడింగ్ అని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని భావించిన టిడిపి చలో అమరావతి అంది.
రాజధాని సాక్షిగా మంత్రి బొత్సాపై ఫైర్ అయిన టీడీపీ నేతల బృందం
ఇక అంతే కాదు అమరావతి లో జరిగిన పనులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ సైతం చూపించి అమరావతిలో టిడిపి హయాంలో ఎంతగా పనులు జరిగాయి అన్నది వైసీపీ నేతలకు తెలిసేలా చేసింది. ఇక అంతే కాదు వైసిపి మంత్రుల తీరును అమరావతి సాక్షిగా ఎండగట్టింది. అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల నేపథ్యంలో రాజధానిలో పర్యటించిన టిడిపి నాయకులు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
రాజధానిలో నిర్మాణాలు మాతో వస్తే చూపిస్తాం అన్న టీడీపీ
మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. అమరావతిలో 12 టవర్లతో శాసన సభ్యులకు 288 ప్లాట్లు సిద్ధం అయ్యాయని వివరించారు. రాజధాని పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానికి వస్తే నిర్మాణాలు ఎలా ఉన్నాయో తాము చూపిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలోనూ, హైకోర్టు విషయంలోనూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీ గా మారాయి.
రాజధాని, హైకోర్టులపై పవన్ తాజా వ్యాఖ్యలు .. రాయలసీమ వాసుల ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని వ్యవహారంలో వైసిపి నేతలపై సెటైర్లు వేస్తూ రాజధాని పులివెందులలో ఏర్పాటు చేసి,అక్కడికి దగ్గరగా ఉన్న కర్నూల్ లో హైకోర్టు నిర్మించాలని అప్పుడు జగన్ కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు కర్నూలు జిల్లా వాసులకు ఏమాత్రం రుచించలేదు. రాయలసీమను అవమానించినట్లు గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను ఊరేగించారు న్యాయవాదులు. రాయలసీమను కించపరిస్తే పవన్ కళ్యాణ్ ను రాయలసీమలో తిరగనివ్వమని వారు తేల్చి చెబుతున్నారు.
రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న వైసీపీ
ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అంశం పై రగడ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలైన టిడిపికి, జనసేనకు కౌంటర్ ఇస్తుంది. అమరావతి పై ప్రశ్నలు సంధిస్తున్న టిడిపి నేతలను వైసీపీ చెడ్డి గ్యాంగ్ తో పోలుస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు టిడిపి, జనసేన రెండు ఒకటేనని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని, అందుకే చంద్రబాబు చెప్పినట్టుగానే మాట్లాడుతున్నాడని జనసేనను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజధానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ మరియు జనసేన.. పొలిటికల్ హీట్
రాజధానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ మరియు జనసేన మధ్య సాగుతున్న పంచాయితీ తాజా పరిణామాలతో నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఏదేమైనా రాజధాని విషయంలోనూ, ఏపీ హైకోర్టు విషయంలోనూ రాజుకున్న రాజకీయ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఏపీలో కొనసాగుతున్న ఈ మూడు పార్టీలాట ఏపీకి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి తీసుకు వస్తుందో అన్న అనుమానాలకు కారణం అవుతుంది.