Amaravati: ధర్నా శిబిరాల్లో విష్ణు సహస్ర పారాయణాలు, గోవిందనామాలు..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రోజుకో తరహాలో రైతులు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మనసు మార్చాలని ప్రార్థిస్తూ ధర్నా శిబిరాల్లో గోవిందనామాలు, విష్ణు సహస్ర నామాలు, లలితా సహస్ర నామాల పారయాణాలను చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో పూజలు చేశారు.
మరోవంక- రాజధాని గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఆందోళనల తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బైక్ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో కలిసి నిరసన రాజధాని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
జీఎన్ రావు కమిటీని రద్దు చేయాలంటూ పెదపరిమిలో ప్రభుత్వ దిష్ఠిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. ఇదివరకు ఇదే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన విషయం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నిడమర్రు, నవులూరు, యర్రబాలెంలల్లో రైతుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలల్లో వాటి తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
ప్రభుత్వంలో కదలిక రావాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు మారాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి వ్యవసాయ భూములను ఇచ్చిన తమను అధికార పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులంటూ కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల తరువాత ముఖం చాటేశారని, తమను పరామర్శించడానికి రాలేదంటూ నిడమర్ర, నవులూరు గ్రామ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.