రాజధాని మార్పు అంత ఈజీ కాదు, పిల్లల ఆటలా, కేంద్రం చూస్తూ ఊరుకోదన్న సుజనాచౌదరి
ఎముకలు కొరికే చలిలో ఏపీ రాజధాని మార్పు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. సీఎం జగన్ ప్రకటనను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ నేత సుజనాచౌదరి కూడా స్పందించారు. రాజధాని మార్పు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదని తేల్చిచెప్పారు.
చిన్నపిల్లల ఆటనా..
రాష్ట్ర రాజధాని మార్పు అంటే విజ్ఞతతో వ్యవహారించాలని సూచించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చిన్నపిల్లల ఆట మాదిరిగా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని అంటే అమరావతి అనే బ్రాండ్ వచ్చిందని.. ఈ క్రమంలో క్యాపిటల్ సిటీ మార్పు అనేది సరికాదని అభిప్రాయపడ్డారు. సచివాలయ ఉద్యోగులు వ్యయ ప్రయాసలు పడి.. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారిని విశాఖపట్టణం తరలిస్తామని చెప్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
లెజిస్లేటివ్ క్యాపిటల్ లేదే..
ఏపీ అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలపై చర్చించలేదని సుజనాచౌదరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది ఉండదని.. కానీ జగన్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప.. రాజధానుల మార్పు కాదని చెప్పారు. గత ప్రభుత్వం విజన్ అంటూనే కాలం గడిపిందని టీడీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. గతాన్ని తలచుకుంటూ వైసీపీ సర్కార్ బాధపడుతున్నట్టు ఉంది అని చెప్పారు.
అంత ఈజీ కాదు..
రాజధాని మార్పుపై జగన్ ప్రకటన సరికాదని సుజనాచౌదరి అన్నారు. రాజధానిని అంత తేలికగా మార్చడం కుదరదని చెప్పారు. కోర్టు ఉన్నంత మాత్రానా అది రాజధాని అయిపోదని చెప్పారు. క్యాపిటల్ సిటీ అమరావతిలోనే ఉంటుందని.. రైతులు ఆందోళన చెందొద్దని సూజనాచౌదరి సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తెచ్చుకోవాలో కూడా జగన్ ప్రభుత్వానికి తెలియడం లేదు అని విమర్శించారు. ముందు కేంద్రంతో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు.
మంత్రుల కౌంటర్
టీడీపీ, బీజేపీ నేతల కామెంట్లపై మంత్రులు కూడా ఖండిస్తున్నారు. టీడీపీ చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు రాజధాని మార్పు గురించి జయప్రకాశ్ నారాయణ మద్దతివ్వడం విశేషం.