తుది నివేదికలో న్యూ అమరావతి: జగన్ తో రాజధాని నిపుణుల కమిటీ భేటీ: తరలింపుపై త్వరలో కీలక ప్రకటన..!
అమరావతి: రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. గురువారం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలుస్తోంది.
తరలిస్తారంటూ మంత్రి సైతం
సంవత్సరానికి మూడు పంటలు పండే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని అమరావతిని నిర్మించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు నుంచీ కొంత వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే వస్తోంది. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు లేకపోలేదంటూ ఇదివరకే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకట్రెండు సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఇలాంటి వాతావరణంలో రాజధాని తరలింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని వేసింది.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో..
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు సమన్వయకుడిగా ఈ నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేటీ రవీంద్రన్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, అరుణాచలం, డాక్టర్ సుబ్బారావు, విజయమోహన్ లు సభ్యులుగా ఉన్నారు. విజయ మోహన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించారు. వారందరూ స్థానిక, పట్టణ పరిపాలనపై అవగాహన ఉన్న వారే కావడంతో రాజధానిపై సమగ్ర నివేదికను అందించే బాధ్యతను ముఖ్యమంత్రి వారికి అప్పగించారు.
రాష్ట్రం మొత్తం పర్యటించిన కమిటీ..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించింది ఈ కమిటీ. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మూడు నెలల పాటు పర్యటలను నిర్వహించింది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ప్రజా సంఘాల నాయకులతో సమావేశమైంది. రాజధాని ప్రాంత నిర్మాణం, హైకోర్టు సహా కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలను ఎక్కడెక్కడ? ఏఏ ప్రాంతాల్లో నిర్మించాలనే విషయంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటితో ఓ నివేదికను రూపొందించింది.
ముఖ్యమంత్రి చేతికి తుది నివేదిక..
తాము రూపొందించిన తుది నివేదికను నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చేతికి అప్పగించినట్లు చెబుతున్నారు. అందులోని అంశాలేమిటనేది అధికారికంగా తెలియ రాలేదు. దీనిపై వైఎస్ జగన్ లేదా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో అమరావతి తరలింపుపై ప్రభుత్వం నుంచి విస్పష్టమైన ప్రకటన వస్తుందని అంటున్నారు.
ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు
రాజధాని అమరావతిని తరలించాలా? వద్దా? అనే విషయంపై నిపుణుల కమిటీ రెండు ఆప్షన్లను ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకటి- ప్రస్తుతం ఉన్న చోటే రాజధాని నగరాన్ని నిర్మించడం.. రెండు- ఇప్పుడున్న ప్రదేశం నుంచి అయిదు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రాజధానిని తరలించడం. ఇప్పుడున్న చోటే అమరావతిని నిర్మించాల్సి వస్తే.. 33 వేల ఎకరాలు అవసరం ఉండదని నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి సూచించినట్లు చెబుతున్నారు.
రెండో ఆప్షన్ గా.. న్యూ అమరావతి
నిపుణుల కమిటీ సూచించిన ప్రకారం.. రెండో ఆప్షన్- పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిలోని భవనాలను అయిదు నుంచి 10 కిలోమీటర్ల దూరానికి తరలించడం. అంటే గుంటూరు జిల్లా కాజా సమీపంలో ఏర్పాటు చేయడం. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రాజధాని నిర్మించడం. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన సచివాలయం గానీ, హైకోర్టు భవనం గానీ తాత్కాలికమైనవే కావడంతో.. వాటిని తరలించడం సులువు అవుతుందనే అభిప్రాయం నిపుణుల కమిటీలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
రాజధాని రైతుల్లో అభద్రతా భావం..
రాజధాని నగరాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితే ఎదురైతే.. భూములు ఇచ్చిన రైతుల్లో అభద్రతా భావం వ్యక్తమయ్యే అవకాశం ఉందని నిపుణుల కమిటీ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. తాము ఇచ్చిన భూములు మళ్లీ వెనక్కి వస్తాయా? రావా? అనే అనుమానాలతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుందా? లేదా? అనే భయాందోళనలు వ్యక్తం కావడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.
వికేంద్రీకరణ అత్యవసరం..
రాష్ట్రంలో అధికారాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆ వికేంద్రీకరణ కూడా సమపాళ్లలో ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు. రాయలసీమ ప్రజల మనోభాావాలు, వారి డిమాండ్లు, శ్రీబాగ్ ఒప్పందానికి అనుగుణంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాల్సి వస్తే.. ఉత్తరాంధ్ర వారికి సౌకర్యంగా ఉండటానికి విశాఖపట్నం లేదా విజయనగరంలల్లో హైకోర్టు బెంచ్ ను నెలకొల్పాల్సి ఉంటుందని సూచించినట్లు సమాచారం.