భూమా అఖిలప్రియ వర్సెస్ వైఎస్ జగన్: కంపెనీలు పరార్, కర్నూలే రాజధాని, హైకోర్టు ఎందుకు..?
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కేసీ కెనాల్ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. సీఎం జగన్ మాత్రం ఎందుకు నీరివ్వడం లేదు అని ప్రశ్నించారు. శ్రీశైలంలో 871 అడుగుల నీటిమట్టం ఉన్నా.. నీరు వదలడం లేదని.. ఇందుకు కారణం సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్కు భయపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
కంపెనీలు పరార్..
సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేశారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. కంపెనీలను బెదిరించడంతో కియా అనుబంధ పరిశ్రమలు వెళ్లిపోయానని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ మరో రూ.2 వేలు కోట్లు కేటాయిస్తే పనులు జరిగేవి కదా.. గత ప్రభుత్వం కేటాయించిన నిధులే తప్ప... జగన్ ఎందుకు కేటాయించడం లేదన్నారు.
విమానాలు నడిపించలేదు..
గత ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటు చేశామని.. కానీ వైసీపీ ప్రభుత్వం విమానాలు నడిపించడంలోనూ విఫలమైందని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో సౌర, పవన విద్యత్ ప్లాంట్లతో 13 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. దీంతో వారికి బతుకు భరోసా ఏర్పడింది. కానీ సీఎం జగన్ మాత్రం పరిశ్రమల ప్యానెళ్లు ధ్వంసం చేసి పొట్ట కొట్టారని విమర్శించారు.
పెట్టుబడులు వెనక్కి
వచ్చే పెట్టుబడులను కూడా అడ్డుకొందని మండిపడ్డారు. కాళహస్తి వద్ద ఎన్టీపీసీ బెల్ కంపెనీ తరలిపోతున్నా.. రేణిగుంట వద్ద రియలన్స్ కంపెనీ వెళ్లేలా చేశారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలి.. కానీ విశాఖకు తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
రాజధాని కాక..
కర్నూలుకు రాజధాని ఇవ్వకుండా హైకోర్టు ఇస్తామని మోసం చేస్తున్నారని, ఇది తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కృష్ణా నదిలోంచి 750 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని చెప్పారు. ఆ నీటిని ఒడిసిపట్టుకుంటే.. తాగు, సాగునీరు కష్టాలు తీరేవన్నారు. సీమలో మంచినీటి, సాగునీటి కష్టాలకు సీఎం జగనే కారణమని విమర్శించారు.