రాజధాని రాష్ట్ర పరిధిలోకే, మారదని చెబితే మోసమే, అమరావతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మరోసారి నోరు విప్పారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. కేంద్రానికి సంబంధం లేదన్నారు. అమరావతిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపాకే తాను కామెంట్ చేశానని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు ఫైరయ్యారు.
రాజధాని మార్పు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని జీవీఎల్ నర్సింహారావు స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్ సీఎం వేసవిని రాజధానిని ప్రకటించారని గుర్తుచేశారు. అంటే దీనిని బట్టి రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని తేలిపోయిందన్నారు. అమరావతిలో రైతులు భూముల సమస్యలను సీఆర్డీఏ చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, ప్రజలకు హైకోర్టులో న్యాయం జరుగుతోందన్నారు. కానీ కొందరు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళతామని మభ్యపెడుతున్నారని గుర్తుచేశారు. ఇది సరికాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర శాఖలు కోరిన అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చేయబోదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కోరతాం.. కానీ కేంద్రం అలా చేయదు కదా అని గుర్తుచేశారు. కొన్ని మీడియా సంస్థలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయని జీవీఎల్ గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు. రీపిట్ అయితే కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేస్తానని స్పష్టంచేశారు.
అమరావతిపై తన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ స్టాండ్ అని చెప్పారు. జాతీయ నేతలతో చర్చించాకే మాట్లాడుతున్నానని చెప్పారు. వారి సూచనల మేరకు అభిప్రాయం వ్యక్తం చేశానని తెలిపారు. కానీ కొందరు స్వలాభం కోసం మభ్య పెడుతున్నారని.. అదీ తగదన్నారు. అమరావతి రాజధాని మారదు అని ఎవరైనా చెబితే అది వారి వ్యక్తిగతం అవుతుందే.. తప్పా, కేంద్ర నాయకత్వం మాటలు కాబోదన్నారు.