సీఆర్డీఏకు రాజధాని రైతుల ఫిర్యాదుల వెల్లువ..హైపవర్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా ?
ఏపీ రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తుంటే ఏపీ సర్కార్మాత్రం రాజధాని విషయంలో తరలింపు వైపే మొగ్గు చూపుతుంది. రాజధాని విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవటం కోసం జీఎన్ రావు కమిటీ నివేదికను, బోస్టన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ తన నివేదిక విషయంలో రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది .
ఈ నేపధ్యంలో రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం నోటీసులిచ్చింది . ఇక అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైపవర్ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని ఇటీవల కోరిన నేపధ్యంలో రాజధాని ప్రాంత రైతులు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు.
భూములు ఇచ్చిన రైతులు తమ విజ్ఞప్తులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వటంతో ఇప్పటి వరకు 3100 రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో రాజధాని రైతుల విజ్ఞప్తులను హైపవర్ కమిటీ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి . రాజధాని ప్రాంత రైతులు మాత్రం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని లేదంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధం అని చెప్తున్నారు. అంతే కాదు సీఆర్డీఏ రద్దు చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.