రాజధాని రైతుల రివెంజ్ .. మహిళలపై దాడి చేసిన పోలీసులకు చుక్కలు చూపిస్తూ..
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో పోలీసులు మహిళలపై దాడి చెయ్యటం, అమానుషంగా ప్రవర్తించటం, వారిపై దుర్భాషలాడటంవంటి ఘటనలు ఏపీ రాజధాని రైతుల్లో ఆగ్రహానికి , రాజధాని అమరావతిలో ఉద్రిక్తతలకు కారణం అయ్యింది . గత శుక్రవారం అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె నేపధ్యంలో మందడంలో మహిళలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై దాడి చేసి మరీ అరెస్ట్ చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు .
పోలీసుల కాళ్ళు పట్టుకున్న రైతులు .. మా బంద్ కు సహకరించాలని వేడుకోలు
పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో సహాయ నిరాకరణ
ఈ ఘటన నేపధ్యంలో రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. తమ గ్రామాల్లోకి వచ్చి తమపైనే జులుం ప్రదర్శిస్తున్న పోలీసులకు వారు చుక్కలు చూపిస్తున్నారు. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నారు. పోలీసులకు కనీసం త్రాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. టిఫిన్, భోజనం అమ్మకాలు నిలిపివేయాలని చాలా గ్రామాలు నిర్ణయించాయి.
పోలీసులు కూర్చోకుండా బల్లలమీద తారు, మడ్డి ఆయిల్ పూసిన గ్రామస్తులు
పోలీసులకు ఎటువంటి విక్రయాలు చెయ్యకూడదని కూడా దుకాణ యజమానులకు గ్రామస్థులు చెప్పారు. అలాగే పోలీసులు కూర్చోకుండా బల్లలమీద తారు, మడ్డి ఆయిల్ పూసి తమ కసి తీర్చుకుంటున్నారు. ఇక నేడు 27వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో ప్రజలు పోలీసులు అడ్డుకుంటున్నా దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇటు పోలీసుల ఆంక్షలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు.
నీళ్లు కూడా ఇవ్వకుండా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న గ్రామాల ప్రజలు
దీంతో రైతులు తమ గ్రామాల్లో తమనే కూర్చోనీకుండా ఇబ్బంది పెడుతున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యటమే కాకుండా ఎవరూ పోలీసులకు గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని గ్రామాల ప్రజల సహాయ నిరాకరణతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. కూర్చోటానికి లేక చుక్కలు చూస్తున్నారు. గుక్కెడు నీళ్ళు కూడా స్థానికులు ఇవ్వకపోవటంతో పోలీసులు నరకాన్ని చూస్తున్నారు. మొత్తానికి తమను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులకు రాజధాని రైతులు తమ సహాయ నిరాకరణతో సమాధానం చెప్తున్నారు.