'ఆదర్శ' జంషెడ్పూర్: ఎపికి 25వేల ఎకరాల భూమి
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, గుంటూరు... ఇలా పలు ప్రాంతాలను రాజధాని కోసం పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలనేది సెప్టెంబరు నెలలోగా తేల్చుతామని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రెండు రోజుల క్రితం చెప్పారు.
కాగా, ఎపి రాజధాని కోసం ప్రత్యేక కమిటీ ప్రధానంగా పంజాబ్ - హర్యానాల రాజధాని అయిన చండీగఢ్, ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్, గుజరాత్ రాజధాని అయిన గాంధీనగర్, ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్లను పరిశీలించవచ్చునని సూచించింది.
చండీగఢ్.. పంజాబ్ - హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. మహారాష్ట్ర నుండి విడిపోయాక గుజరాత్లో అహ్మదాబాద్ నగరం సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నా... దానిని కాదని గాంధీ నగర్లో రాజధానిని ఏర్పాటు చేశారు. అయిదేళ్లలో దీని నిర్మాణం జరిగింది. 2000 ఛత్తీస్గడ్ ఏర్పడింది.
రాయ్పూర్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయా రాయపూర్ పేరిట రాజధాని నిర్మాణం జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి బ్రిటీష్ హయాంలో కటక్ రాజధానిగా ఉండేది. 1948లో భువనేశ్వర్ను రాజధానిగా చేశారు. ఇక జంషెడ్ పూర్ ప్రణాళికబద్దంగా నిర్మించిన నగరం. దీనిని మన రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ప్రాతిపదికగా తీసుకోవాలని కమిటీ సూచించింది.
కాగా, ఎపిలో ఆదర్శవంతమైన రాజధాని నిర్మాణం కోసం 25వేల ఎకరాల భూమి కావాలని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. పూర్తిస్థాయి ప్రణాళిక బృందాన్ని నియమించాలని, అందులో నిపుణులైన సివిల్ ఇంజనీర్లు ఉండాలని పేర్కొంది. రాజదానికి అవసరమైన భవన నిర్మాణాలతో పాటు చక్కటి రవాణా వసతులు, రహదారుల నిర్మాణం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటివి ప్రణాళికా బద్ధంగా జరగాలని పేర్కొంది.