క్యాపిటల్ వార్ .. 32వ రోజు .. అసైన్డ్ రైతుల ర్యాలీలు, యజ్ఞాలు, గవర్నర్ కు రాజధాని మహిళల వినతులు
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న నిరసనలు నేటితో 32వ రోజుకు చేరాయి. ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం రాజధాని విషయంలో తుది నిర్ణయానికి కసరత్తులు చేస్తుంది . ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనా కార్యక్రమాలను ఉధృతంగా కొనసాగిస్తున్నారు . ఇక మరోపక్క ఈనెల 20న అసెంబ్లీ భేటీ కారణంగా అసెంబ్లీ ముట్టడికి, జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది అమరావతి జేఏసీ .
రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా శివస్వామి యజ్ఞం
ఇక రాజధాని గ్రామాలైన తుళ్ళూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయ పాలెంలో రైతులు మహా ధర్నా కొనసాగిస్తున్నారు. సేవ్ అమరావతి అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి రైతులకు బాసటగా నిలిచారు శివస్వామి. రాజధానిగా అమరావతి కోసం శ్రీపాసుపత సంపుటీకరణ మహా కాలభైరవ యజ్ఞాన్ని నిర్వహించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి శాస్త్రోస్తంగా ఈ యజ్ఞానికి సంబంధించిన పూజా కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ యజ్ఞం జరుగుతుందని స్వామీజీ తెలిపారు . అలాగే 29 గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాల వద్ద హోమాలు కూడా నిర్వహిస్తామని శివస్వామి తెలిపారు.
తుళ్లూరులో అసైన్డ్ రైతులు భారీ ర్యాలీ
ఇక 32వ రోజు నిరసనలలో భాగంగా తుళ్లూరులో అసైన్డ్ రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని, తమకు భూములు అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సీఆర్డీఏ ఆఫీస్ వరకూ ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళలు ర్యాలీ చేపట్టారు.మరోవైపు రాజధాని అమరావతిని తరలించొద్దంటూ మందడంలో మహిళలు, రైతులు ర్యాలీ చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. పోలీసులు టెంట్ వేసుకోవడానికి అనుమతివ్వకపోవడంతో వారు ఎండలోనే నిరసనకు దిగారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు.
గవర్నర్ ను కలిసిన రాజధాని మహిళలు
ఇక ఇది ఇలా ఉంటె రాజధాని అమరావతి ప్రాంత మహిళలు గవర్నర్ను కలిసారు. తాము శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తమపై దాడులు చేస్తున్నారని, చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టులు, దాడుల అంశాల్ని బిశ్వభూషణ్కు మహిళలు వివరించారు. ఈ వ్యవహారంలో రాజ్భవన్ జోక్యం చేసుకోవాలని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహిళలు గవర్నర్ ను కోరారు.