క్యాపిటల్ వార్: ఏపీ సీఎం వై ఎస్ జగన్ కు చెవిటి మిషన్, కళ్లజోడును పంపి బుద్దా వెంకన్న నిరసన
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా ఉంచాలని రాజధాని రైతులు పోరాటం చేస్తున్నా కళ్ళున్న గుడ్డి వాళ్ళలా , చెవులున్న చెవిటి వాళ్ళలా జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడిన బుద్దా వెంకన్న జగన్ కు కళ్ళజోడు , చెవిటి మిషన్ పంపి వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధాని రైతుల్ని సీఎం జగన్ తన నిర్ణయంతో చాలా క్షోభ పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు .
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బుద్దా వెంకన్న అమరావతి రైతుల పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపిన సందర్భంగామాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నేనున్నాను, నేను విన్నాను అని జగన్ అన్నారని , 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
అమరావతి రైతుల గుండెకోత మీకు వినిపించటం లేదా ? వారి ఆందోళనలు మీకు కనిపించటం లేదా అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమ సొంత రాష్ట్ర ప్రజలపై లేదా? అని టీడీపీ నేత వెంకన్న ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా ఉన్న, అన్ని వసతులు ఉన్న అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్న టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బుద్దా అన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరికలు జారీ చేసిన బుద్దా రాజధాని అమరావతి విషయంలో రైతుల పక్షాన పోరాటం సాగించి తీరుతామని చెప్పారు.